Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతా అనుమానాస్పదమే
- రెండు కుటుంబాల్లో విషాదం
- షేర్మార్కెట్తో నష్టాలా? కుటుంబ కలహాలా?
నవతెలంగాణ-గండిపేట్/అమీన్పూర్
రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఔటర్రింగ్ రోడ్డు సమీపంలో జరిగింది. చెట్లపొదల్లో ముగ్గురు మహిళల మృతదేహాలు పడిఉండటం, కొద్ది దూరంలో కారులో తండ్రీ, కొడుకుల మృతదేహాలుండటం, కారు డోర్కు బయట నుంచి తాళంచెవుల గుత్తి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రియల్ఎస్టేట్ వ్యాపారం, షేర్మార్కెట్లో నష్టాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా? కుటుంబ కలహాల వల్ల ఇలా చేశారా? ఇంకెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
నార్సింగి పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల ప్రభాకర్రెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన అతని చిన్నమ్మ, ఆమె కుమార్తె సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఉంటున్నారు. ప్రభాకర్రెడ్డి(38), అతని భార్య మాధవి(32), కుమారుడు హర్షిత్రెడ్డి(4), అతని చిన్నమ్మ లక్ష్మి(40), ఆమె కుమార్తె సింధూ(16) సోమవారం డిండి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఈ విషయాన్ని అతను బాబాయి రవీందర్రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. సాయంత్రం ఇంటికి వస్తున్నామని కుటుంబీకులకు మళ్లీ ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత అందరి ఫోన్లూ స్విచ్ఛాఫ్ వచ్చాయి. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానంతో రవీందర్రెడ్డి కుటుంబసభ్యులు అమీన్పూర్ పీఎస్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డినగర్ కాలనీ కంచె సమీపంలో కారులో ఇద్దరు, కొద్దిదూరంలో చెట్ల పొదల్లో ముగ్గురు మహిళలు చనిపోయి ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి సీఐ రమణగౌడ్, ఎస్ఐ నారిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో మృతిచెంది ఉన్నది ప్రభాకర్రెడ్డి, అతని కొడుకుగా పోలీసులు గుర్తించారు. కారుకు కొద్ది దూరంలో చెట్ల పొదల్లో ఉన్న మృతదేహాలు మాధవి, లక్ష్మి, సింధూవి అని తేల్చారు. వీరంతా కేకులో విషం కలిపి తీసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్రెడ్డి భార్య మాధవి గృహిణి, కొడుకు వర్షిత్ ఎల్కేజీ చదువుతున్నాడు.
సింధూజ ఇంటర్ చదువుతుండగా, తల్లి లక్ష్మి ఇంటివద్దే ఉంటోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ప్రభాకర్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాధవి, లక్ష్మి పేరుతో ప్రభాకర్రెడ్డి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాడని, వారి డిమ్యాట్లో అకౌంట్లలో రూ.1.3కోట్ల వరకు డిపాజిట్ ఉన్నట్టు తెలుస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. వీరి ఆత్మహత్యకు కారణం స్టాక్ మార్కెట్లో నష్టమా? కుటుంబ కలహాలా.? ఇంకేమైనా కారణాలున్నాయా? ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమీప గ్రామాల ప్రజలను కూడా ప్రశ్నిస్తున్నారు. క్లూస్టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుల కాల్డేటాను కూడా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటనాస్థలిని సందర్శించిన సీపీ సందీప్ శాండిల్యా
ఘటనాస్థలిని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా సందర్శించారు. డీసీపీ, స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులతో కాదు : కుటుంబీకులు
తమకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని, వారు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో అంతుపట్టడం లేదని లక్ష్మి భర్త రవీందర్రెడ్డి చెప్పారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదన్నారు. ప్రభాకర్రెడ్డి, లక్ష్మి కుటుంబాలు స్థానికంగా అందరితో కలిసిమెలసి ఉండేవని స్థానికులు తెలిపారు. వారు ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందో తమకూ అర్థం కావడం లేదని చెప్పారు. ఇంత బాధ ఉన్నా వారు మామూలుగానే ఉండేవారని, ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మశక్యంగా లేదని చెప్పారు. రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు ఒకేసారి మృతి చెందడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.