Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీసీల అభివృద్ధిపై చర్చ : అసెంబ్లీలో కేసీఆర్ వెల్లడి
- ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై డిసెంబర్లో ప్రత్యేక సమావేశాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎంబీసీల అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంబీసీల గుర్తింపు కోసం బీసీ కమీషన్ సమయం కోరిందని, ఆ నివేదిక రాగానే కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అన్ని పార్టీలలో ఉన్న బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిసెంబర్ 3న అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశానికి బీసీ కమీషన్నూ, అధికారులనూ ఆహ్వానిస్తామన్నారు. ఎంబీసీల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు కేటాయించినా అందులో రూ 230 కోట్లే విడుదల చేశారని, ఎంబీసీల కులాల జాబితాను రూపొందించి వారి అభివృద్ధి కోసం బడ్టెట్ కేటాయింపులు ఖర్చు చేయాలని సీపీఐ(ఎం) సభ్యుడు సున్నం రాజయ్య తో ఇతర పార్టీల సభ్యులు పస్తావించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పైవిధంగా స్పందించారు.
శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో సీపీఐ(ఎం) సభ్యులు సున్నం రాజయ్య, టీడీపీ సభ్యులు ఆర్.కృష్ణయ్య, బీజేపీ సభ్యులు లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సమాధానం చెప్పిన తర్వాత సిఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ త్వరలోనే ఎంబీసీలపై సమగ్ర వివరాలు అందజేస్తుందన్నారు. దానిపై 3న సమావేశంలో చర్చించి బీసీల అభివృద్ధికి ఎజెండా ఖరారు చేద్దామని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా దారిమళ్లించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దళితుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ,ఎస్టీల అభివృద్ధికి నిధులు కేటాయింపు, ఖర్చు, ఆ వర్గాల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు డిసెంబర్లో రెండురోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్ బిల్లు కూడా అప్పుడే తీసుకొస్తామన్నారు. ఎస్సీల అభివృద్ధిలో నిధుల వ్యయంపై కాంగ్రెస్ సభ్యులు సంపత్కుమార్, గీతారెడ్డి, జీవన్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సీఎం మాట్లాడుతూ పారదర్శకంగా ఉంటామని, ఎక్కడికీ పారిపోబోమని చెప్పారు. దళితులకు కేటాయించిన నిధుల విడుదలలో అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. మూడెకరాల కోసం దళితులు ఎదురు చూస్తున్నారని, ఇంకెన్నాళ్ళకు మూడెకరాలు ఇస్తారని సంపత్ ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల దళితులకు న్యాయం జరగడం లేదని గీతారెడ్డి అన్నారు.
పెన్డ్రైవ్లో లక్ష పేజీలతో వివరాలు
'' ప్రగతి పద్దు కింద మొత్తం కేటాయింపు రూ 88 వేల71 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ33 వేల462 కోట్లు ఖర్చు చేశాం. ఎస్సీ ప్రత్యేక నిధి కింద రూ 14,375.13 కోట్లు కేటాయించగా...ఇప్పటి వరకు రూ5,475.02 కోట్లు ఖర్చు చేశాం. ఎస్టీ ప్రత్యేక నిధి కింద రూ.8,165.87 కోట్లు కేటాయించాం. ఇప్పటి వరకు రూ 3,359.37 కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ నిధులు పక్కదారి పట్టాయి. ఎస్సీల అభివద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు చివరి మూడేండ్లలో రూ 2,651 కోట్లు ఖర్చు చేస్తే.. మా ప్రభుత్వం ఈ మూడేండ్ల కాలంలో రూ 6,713 కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ 20 లక్షలు ఇస్తున్నాం. టీఎస్ప్రైడ్ కింద దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. వందశాతం సబ్సిడీతో ఎస్సీలకు రుణాలు ఇస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలోనే అమలవుతుంది'' అని సీఎం వివరించారు. ఎస్సీ,ఎస్టీల నిధుల ఖర్చుకు సంబంధించి అన్ని వివరాలతో ప్రభుత్వం శాసనసభ్యులందరికీ లక్ష పేజీల సమాచారంతో పెన్డ్రైవ్ అందజేసింది.
మహాజన పాదయాత్రతోనే ఎంబీసీ కార్పోరేషన్ : సున్నం రాజయ్య
సామాజిక వివక్షపై సీపీఐ(ఎం) పార్టీ చేపట్టిన 'మహాజన పాదయాత్ర' తర్వాతే ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిం దని ఆ పార్టీ సభ్యులు సున్నం రాజయ్య అన్నారు. అసెంబ్లీలో సున్నం రాజయ్య మాట్లాడుతూ, ఎంబీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకంలో వీరు భాగస్వాములు కాలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎంబీసీల జాబితా ప్రకటిస్తా మని ప్రభుత్వం చెప్పిందని ఆయన సభ దష్టికి తీసుకొచ్చారు. నిధులు ఇంతవరకు కేటాయిం చలేదని, ఎంబీసీల ప్రాధాన్యత క్రమాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేదని విమర్శించారు.