Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి హరీశ్రావు వెల్లడి
- నేడు మిర్యాలగూడెంలో ఆయకట్టు రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశం
- కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయనున్న నీటిపారుదల శాఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా యాసంగి పంటల కోసం డిసెంబర్ 10 నుంచి నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్టు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో శుక్రవారం అసెంబ్లీ హాల్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు స్ఠూలంగా ఏకాభిప్రాయం కుదిరింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈసమావేశంలో పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో శనివారం మిర్యాలగూడెంలో జరిగే ఆయకట్టు రైతులు, ప్రజాప్రతినిధులతో జరిగే కీలక సమావేశంలో సాగర్ నీటి విడుదలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఖరాచు చేస్తామని మంత్రి చెప్పారు. గత ఏడాది సాగర్ ఎడమ కాల్వ కింద యాసంగి పంటల కోసం 36టీఎంసీల నీటిని వినియోగించినట్టు ఆయన తెలిపారు. ఈ సారి యాసంగి పంటల కోసం 40టీఎంసీల నీటిని కేటా యిస్తామన్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో నీరు విడుదల చేయటంతో పాటూ సాగునీటి నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తల వల్ల ఒక టీఎంసీ నీటితో 10,639 ఎకరాలు సాగులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. సాగర్ ఎడమ కాల్వ కింద 2012-13 యాసంగిలో 34.05 టీఎంసీల ద్వారా 2.58 లక్షల ఎకరాలు, 2013-14లో 72.09 టీఎంసీల ద్వారా 4.37 లక్షల ఎకరాలు, 2014-15లో51.04 టీఎంసీల ద్వారా 2.76లక్షల ఎకరాలు, 2016 -17లో 36 టీఎంసీలతో 3.83 లక్షల ఎకరాలకు సాగునీరందించినట్టు హరీశ్రావు వివరించారు. ఈసారి 40టీఎంసీలు విడుదల చేయాలని ప్రతి పాదించగా 4.50 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసే అవకాశం ఉన్నదన్నారు. ఎడమ కాల్వ కింద మిగతా రెండు లక్షల ఎకరాల పరిధిలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందించలేనప్పుడు వరిపంట వేస్తే రైతులు ఇబ్బందిపడే అవకాశం ఉన్నందున ముందుగానే వారికి అవగాహన కల్పించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. సాగునీటి కార్యాచరణ ప్రణాళిక ఖరారవుతున్నందున ఇంజినీర్లు కాల్వల వెంట కాలినడకన పర్యటించాలని ఆయన ఆదేశించారు. కాల్వల్లో నీటి పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఆన్ అండ్ ఆఫ్ విధానంతో నీటి సరఫరా వల్ల మంచి ఫలితాలు వచ్చినందున దానిని అనుసరించాలన్నారు. ఉన్నతస్థాయి సమావేశంలో ఎంపీలు గుత్తా సుఖేందర్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజరుకుమార్, మల్లు భట్టివిక్రమార్క, వీరేశం, రవీంద్రనాయక్, భాస్కరరావు, మదన్లాల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, ఈఎన్సీ మురళీధరరావు, సాగర్ సీఈ సునీల్ తదితరులు హాజరయ్యారు.