Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర వీరభద్రీయ కుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాల్లో వీరభద్రీయ కులస్తులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉపేంద్రకర్నె డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరభద్రీయ కులం సంచార జాతులకు చెందినదని, పాత ఇనుప సమాన్లు, ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కొంత మంది వాచ్మెన్లుగా, హమాలీలుగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని చెప్పారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కనుక ఈ కులస్తులు అభివృద్ధి చెందడానికి బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు ఇవ్వాలని, ఒక ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు కర్నె శివకుమార్, ప్రధాన కార్యదర్శి కాటి నాగరాజు, సహాయ కార్యదర్శి రావుల కృష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.