Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభలో రైతుల జాబితాను అందించడంలో విఫలం
- వాయిదా అనంతరం స్పీకర్కు అందజేత
- ఇదేం పద్ధతంటూ పార్టీ నేతల ఆగ్రహం
- ఇంకెప్పుడు నిలదీస్తారంటూ అసహనం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విసిరిన సవాల్ను స్వీకరించడంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పార్టీ ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీలో రైతులపై వడ్డీభారం పడిందని కాంగ్రెస్పార్టీతో సహా అన్ని పార్టీలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం రైతులను రుణవిముక్తుల్ని చేశామని,ఒకవేళ ఉంటే వారం పది రోజుల్లో వివరాలతో సహా జాబితాను స్పీకర్కు అందజేస్తే ఈ సమావేశాల్లోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్పార్టీకి సవాల్ విసిరారు. అయితే ఈ అంశంపై చర్చ జరుగుతున్న క్రమంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ కాంగ్రెస్పార్టీ ఫెయిలైంది. ప్రభుత్వాన్నే డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్పార్టీ, చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన సవాల్ను కాంగ్రెస్పార్టీ స్వీకరించాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి వారంలో రోజుల్లో రైతుల వడ్డీ జాబితాను సేకరించి ప్రస్తుత సభలోనే సమర్పిస్తామని ప్రతి సవాల్ విసిరారు. తమ పార్టీ జిల్లా నేతలు, కిసాన్సెల్ నేతల సహకారంతో వడ్డీ అందని రైతుల జాబితాను 40వేలకు పైగా దరఖాస్తులను సేకరించింది. శుక్రవారంతో సభ ముగుస్తుందని ప్రచారం జరుగుతున్నా ఆ పార్టీ నేతలు సీరియస్గా తీసుకోలేదు. సీఎం 50 రోజులు ఉంటుందని చెప్పారని, సమావేశాలపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటామని అధికారపక్షం చెప్పిందంటూ తాత్సారం చేసుకుంటూ వచ్చారు. దీంతో పరిపాలనా సంస్కరణలపై చర్చ ముగిసిన వెంటనే సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. చేసేదేమీ లేక తమ దగ్గర ఉన్న జాబితాలను నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ చాంబర్లో అందజేశారు. దీనిపై ఆ పార్టీ నేతలు, కిసాన్సెల్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వడ్డీకి సంబంధించిన దరఖాస్తులు ఇవ్వడం ద్వారా కేసీఆర్ సవాల్ల్ ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని కాంగ్రెస్పార్టీ జారవిడుచుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. రుణమాఫీ వడ్డీ అందని రైతులు ఎంత మంది ఉన్నారు. ఏఏ నియోజకవర్గంలో ఎంత మంది ఉన్నారు. ఒక్కొక్క రైతు పేరిట వడ్డీ ఎంత ఉంది. ఇత్యాది విషయాలను కాంగ్ర్రెస్ పార్టీ రైతులు, బ్యాంకుల నుంచి సమాచారాన్ని సేకరించింది. దరఖాస్తుల కోసం సేకరించే బాధ్యతను ఆ పార్టీకి చెందిన కిసాన్ సెల్ సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. ఈ కమిటీ గత పది రోజులుగా సేకరించిన సమాచారాన్ని క్రోడికరించి నోట్ కూడా తయారు చేసింది. అయితే 'వడ్డీ'తో సర్కారును తమ పార్టీ నేతలు ఇరుకున పెడతారని అనుకుంటే, తమ పార్టీ సభ్యులే ఇరుకునపడిపోయారని అంటున్నారు. ఇలా అయితే ప్రభుత్వాన్ని ఏ రకంగా నిలదీస్తామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలిసినా తెలియనట్టుగా వ్యవహరిస్తోందన్నారు. జాబితాను సభలో ఇవ్వకపోవడం తమకు నిరాశ కలిగించిందని కిసాన్ సెల్ నేతలు చెబుతున్నారు. తగిన ఆధారాలతో చెప్పడం వల్ల అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ బదనాం అయ్యేందని ఒక సీనియర్ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఇందులో ప్లానింగ్ లేకపోవడం కూడా ఒక కారణమని తెలిపారు.