Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ భద్రత నిబంధనల మేరకే..
- యూఎస్, రాష్ట్ర భద్రత మధ్య వివాదాల్లేవు: డీజీపీ
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
నగరంలో జరిగే అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరవుతున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకకు అంతర్జాతీయ సెక్యూరిటీ నిబంధనల మేరకే భద్రతను కల్పిస్తున్నామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి నవ తెలంగాణకు తెలిపారు. ఈ విషయంలో అమెరికా భద్రతా అధికారులకు, కేంద్ర,రాష్ట్ర భద్రతా అధికారుల మధ్య వివాదాలు నెలకొన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. ఇక్కడికి విచ్చేస్తున్న ఇవాంకకు వారి దేశానికి చెందిన భద్రతా అధికారులు స్వయంగా సెక్యూరిటీని కల్పించుకోవడం నిబంధనల మేరకే జరుగుతున్న ప్రక్రియగా ఆయన వివరించారు. ఆమె భద్రతపై పూర్తి బాధ్యతలను వారే చూసుకుంటారని, అలాగే ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాలలో మన ఎస్పీజీ అధికారులు ఆయన సెక్యూరిటీ బాధ్యతలను నిర్వహిస్తారని , ఆ సమయంలో అయా దేశాల సెక్యూరిటీ అధికారుల పాత్ర పరిమితంగా ఉంటుందని డీజీపీ తెలిపారు. ఇవాంక వ్యక్తిగత సెక్యూరిటీ అమెరికా భద్రతా అధికారులు చూసుకున్నప్పటికీ పూర్తిగా పరిసరాల భద్రతా విధులను నిర్వర్తించేది రాష్ట్ర సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది అని వివరించారు. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరుగుతుండటం, అక్కడి నోవాటెల్ హాటల్లో వీఐపీలు బస చేయడంతో ఆ ప్రాంతాల భద్రతా ఏర్పాట్లను స్వయంగా సైబరాబాద్ కమిషనర్ సందీప్శాండిల్య పర్యవేక్షిస్తున్నారని, ఫలక్నుమా వద్ద నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు నేతృత్వంలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని మహేందర్రెడ్డి తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్రమోడీ పర్యటనను కూడా దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని, ఈ విషయంలో ఎస్పీజీ అధికారుల సహకారాన్ని తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మూడు రోజుల పాటు సాగే సదస్సుకు వివిధ దేశాల నుంచి విచ్చేస్తున్న ప్రతినిధుల సెక్యూరిటీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించామని ఆయన అన్నారు. అవాంఛనీయ శక్తుల కదలికలపై డేగ కన్నేసి ఉంచామని, ఈ విషయంలో మూడు కమిషనరేట్ల పోలీసు అధికారులు, సిబ్బందిని అన్ని విధాలుగా అప్రమత్తం చేయడం జరిగిందని డీజీపీ తెలిపారు.