Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం) ఎమ్మెల్యే సున్నం రాజయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ సర్కారు కౌలు రైతుల బతుకుల్లో చీకటిని నింపిందని సీపీఐ (ఎం) ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. ఎరువుల పథకం ద్వారా కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పటం దారుణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న అణగారిన వర్గాల వారి సమస్యలకు శాసనసభ సమావేశాల్లో పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యలపై చర్చ జరిగినా ప్రభుత్వరంగంలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని ఎత్తేసి.. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామనే హామీనివ్వలేదని విమర్శించారు. స్కీం వర్కర్లకు కనీస వేతనాలనివ్వానే సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సమస్యలు, గిరిజనుల పోడు భూముల సమస్య, రైతులకు మద్దతు ధరలు, ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు, సిబ్బంది నియామకాల గురించి స్పష్టతనివ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరించినప్పటికీ ఎంబీసీల కార్పొరేషన్ గురించి తమ పార్టీ సర్కారును నిలదీయగలిగిందని తెలిపారు. తద్వారా వారి అభివృద్ధిపై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్న హామీని పొందగలిగామని రాజయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతోపాటు భద్రాచలం నుంచి ఆంధ్రాలో కలపబడిన మండలాలను, ఆ పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఎటపాక ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించామని వివరించారు. తిరిగి ఆయా ప్రాంతాలను తెలంగాణాలో కలిపేందుకు ప్రయత్నిస్తామన్న హామీని ప్రభుత్వం నుంచి పొందగలిగామని పేర్కొన్నారు.