Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం పంపిణీలో నిబంధనల ఎత్తివేతకు కృషి చేస్తా
- ఫెడరేషన్ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకెళ్తా: కేజీకేఎస్ రాష్ట్ర మహాసభలో ఎమ్మెల్సీ వి గంగాధర్గౌడ్
నవతెలంగాణ-మహబూబాబాద్
తెలంగాణలో గీత వృత్తిని వ్యవసాయానికి అనుసంధానం చేసి తాటి, ఈత మొక్కల పెంపకానికి వ్యవసాయ శాఖ నుంచి రాయితీతో డ్రిప్ సౌకర్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ చెప్పారు. తాటి చెట్టుపై నుంచి పడి మృతి చెందిన గీత కార్మికులకు పరిహారం పంపిణీలో నిబంధనలు ఎత్తివేసి రూ.ఐదు వేల కోట్లతో ఫెడరేషన్ ఏర్పాటు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తానని హామీనిచ్చారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర రెండో మహాసభ ఆదివారం మహబూబాబాద్లోని వీఆర్ఎన్ గార్డెన్లో వేముల నాగయ్యనగర్ ప్రాంగణంలో ప్రారంభమైంది. కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రారంభసభలో గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ...కల్లు సమగ్ర పాలసీపై సభలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల మంది గీత వృత్తిలో ఉన్నారని, వారికి సరైన సౌకర్యాలు లేవని అన్నారు. గీత వృత్తి నశించి పోతుందని, గత పాలకులు గీత వృత్తిని నిర్వీర్యం చేశారని వాపోయారు. సాధారణంగా తాటి చెట్టు ఆరేండ్లకు కల్లు గీతకు వస్తుందని, అదే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచితే నాలుగేండ్లకే కల్లు పారకానికి వస్తుందని చెప్పారు. కొన్ని జిల్లాలో ఈ పద్ధతి అవలంభిస్తున్నారన్నారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో ఈ విషయం చర్చించినటు తెలిపారు. ఏజెన్సీలలో టీఎఫ్టీల సభ్యత్వ రెన్యూవల్కు కృషి చేస్తానని తెలిపారు. అలాగే రాబోయే కాలంలో టీసీఎస్, టీఎఫ్టీలకు శాశ్వత లైసెన్స్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే సంఘాలకు 5 నుంచి పదెకరాల భూమి కేటాయింపునకు తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. గీత కార్మికుల రెంటల్ మాఫీకి, ట్యాంక్బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణానికి, అధికారికంగా పాపన్న జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
గీత వృత్తి పన్ను రూ.15 కోట్లు రద్దు చేయాలి : ఎంవీ రమణ
ప్రతీఏటా ప్రభుత్వం గీత కార్మికుల నుంచి వసూలు చేస్తున్న గీత వృత్తి పన్నును రద్దు చేయాలని, గీత కార్మికుల సంక్షేమానికి ఐదువేల కోట్లతో ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్ చేశారు. హరితహారం ద్వారా పంపిణి చేస్తున్న మొక్కలకు రక్షణ కల్పించాలని, మొక్కలు పెంచడానికి ప్రతీ సొసైటీకి పదెకరాలను ఇవ్వాలని కోరారు. తాటి ఈత ఉత్పత్తుల ద్వారా 18 రకాల వస్తువులు తయారు చేయవచ్చని కేరళ, తమిళనాడు తరహాలో కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వమే స్వయంగా ప్రజలు నీరా సేవించేలా ప్రచారం నిర్వహించాలన్నారు. ఏజెన్సీలలో సభ్యత్వాలను పునరద్ధరించాలని, గీత వృత్తి పని వారలకు కనీస వేతనం ఇవ్వాలని కోరారు. మానుకోటలోని గాంధీపార్క్లో సోమవారం 10వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సభకు తొలుత వ్యవసాయ మార్కెట్ నుంచి గాంధీ పార్క్ వరకు భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ మహా సభల్లో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు సుధాగాని మురళీ, మండ సుష్మా, గండు సావిత్రమ్మ, కేజీకేఎస్ గౌరవాధ్యక్షులు కల్లెపు వెంకటయ్య, వర్ధెల్లి బుచ్చిరాములు, గౌడ, కల్లుగీత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగాని బాలరాజుగౌడ్, పల్లె లక్ష్మణ్ గౌడ్, బొమ్మగాని నాగభూషణ్ గౌడ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.