Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలమూరు అధ్యయన వేదిక సదస్సులో వక్తల పిలుపు
- కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం డిమాండ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
పాలమూరుకు న్యాయమైన నీటి వాటా కోసం మరో ఉద్యమం చేపట్టాలని మేధావులు, ప్రజాసంఘాలు, ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్ కోసం కృష్ణా నదీజలాల పునఃపంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివాసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవనంలో జరిగిన సదస్సులో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ పూర్వపు పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరందించే నాలుగు ప్రాజెక్టులు 2004 నుంచి కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కేవలం రూ. 1,500 కోట్లు ఖర్చుపెడితే ఇవి పూర్తవుతాయన్నారు. శ్రీశైలం నీటిలో 220 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలిస్తున్నదని ఆరోపించారు. ముచ్చుమర్రి వద్ద అక్రమంగా నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణకు మరింత నష్టం జరుగుతున్నదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి చేపట్టాలని చెప్పామని అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కల్వకుర్తి సామర్ధ్యం 40 టీఎంసీలకు పెంచిన తర్వాత పాలమూరు-రంగారెడ్డితో కలిపి మొత్తం 160 టీఎంసీలను శ్రీశైలం నుంచి తీసుకోవటం సాధ్యమేనా అని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పక్కనే పాలమూరు-రంగారెడ్డి పథకం కూడా పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. జూరాల నుంచి ఎన్నడూ 30, 40 టీఎంసీలకు మించి వినియోగించుకోలేదన్నారు. ఆర్డీఎస్ వద్ద బొక్కలు పూడ్చలేక పోయారని ఆయన ఆక్షేపించారు. పాలమూరు జిల్లా నుంచి ఎవరూ వలసలు పోవటం లేదని వెళ్లిన వారు కూడా వెనక్కి వస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువు ప్రాంతం కర్నాటక, మహారాష్ట్ర కన్నా తక్కువగా ఉన్నదని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ పేర్కొనడం విచిత్రమన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తే తప్ప ఎగువ ప్రాంతాలకు న్యాయం జరగదన్నారు. పాలమూరు ప్రాజెక్టుల కోసం నీటిని పోరాడి సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ మౌనం ప్రమాదకరమన్నారు. ప్రశ్నించే సమాజం ఉంటేనే అన్యాయాన్ని అరికట్టవచ్చన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీ డిమాండ్ తెలంగాణ ఉద్యమ కాలం నుంచే ప్రారంభమయిందన్నారు. పాలమూరు నీళ్ల గురించి మాట్లాడితే నల్లగొండ ఫ్లోరైడ్ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారని, రెండింటినీ ముడిపెట్టి సమస్యను గందరగోళం చేయటం మంచిదికాదని హితవు చెప్పారు. భూమి పంచినా నీరు పంచకపోతే లాభం లేదనాన్నరు. కృష్ణా, గోదావరి నదులపై ఆర్ధర్ కాటన్ ఆనకట్టలు కట్టక ముందు కోస్తా ప్రాంతంలో దుర్భరమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఇవి కట్టిన తర్వాతే ఆక్కడ సంపద, సంస్కరణలు వచ్చాయని గుర్తు చేశారు. నీళ్ల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని మాట్లాడుకునేవారమని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్లీ మాట్లాడుకోవలసి వస్తున్నదన్నారు.
తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల కృష్ణా నీటిలో వెనుకబడిన జిల్లాలకు న్యాయంగా రావాల్సిన వాటాను కేటాయించాలని కోరారు. ఉన్న నీళ్లను కనీసం ఒక పంటకైనా అందించాలన్నారు. నీరు ఇప్పుడు పంచకపోతే ఎప్పటికీ పంచలేరని ఆయన అభిప్రాయపడ్డారు. 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ అందరికీ సమన్యాయం చేయటమే సమాఖ్య స్ఫూర్తి అన్నారు. అందరి హక్కుల్నీ గుర్తించటం రాజ్యాంగంలో భాగమన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలన్నారు. మహబూబ్నగర్ వంటి వెనుకబడిన ప్రాంతాలకు నీరు, నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తే అది ఆదర్శమవుతుందన్నారు. వారి హక్కుల్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల పంపకం, వినియోగంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు మరింత అన్యాయం జరిగిందన్నారు. సమస్యను సమగ్రంగా చూడటం అవసరమన్నారు.
శ్రీశైలం ఎడమ కాల్వ, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులన్నీ ప్రజల పోరాటం వల్ల వచ్చినవేనన్నారు. జల వినియోగానికి సరైన ప్రణాళిక ఉండాలని, కాంట్రాక్టర్ల కోసమే డిజైన్లు చేసే పరిస్థితి ఉండరాదన్నారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ పాలమూరు వెనుకబాటుతనం, వలసలు, కరువుపై 1992 నుంచీ చర్చ జరుగుతూనే ఉందన్నారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న జిల్లాకు నీరందక పోవటం విచారకరమన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే నాటికి ఆర్డీఎస్ పథకం ఒక్కటే ఉందన్నారు. కడగొట్టు బిడ్డకు నీరందాలన్నారు.
కృష్ణా డెల్టాకు నీరు తగ్గించి మహబూబ్నగర్ జిల్లాకు 220 టీఎంసీల నీరివ్వాలని పుచ్చలపల్లి సుందరయ్య అన్నారని గుర్తు చేశారు. నీటి వికేంద్రీకరణ జరగాలని ప్రొఫెసర్ జయశంకర్ కూడా పాలమూరులో జరిగిన సదస్సులో ఆనాడే చెప్పారన్నారు. కృష్ణా నదిలో లభ్యమయ్యే నీరంతా కాల్వల కింది రైతులకే అందిస్తే ఎగువ ప్రాంత రైతులు ఏమైపోవాలని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాలను వెనుకబాటుతనం ప్రాతిపదికన జిల్లాలకు పునఃపంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రముఖ ఇంజినీర్లు రమేశ్రెడ్డి, లక్ష్మీనారాయణ, రామకృష్ణా రెడ్డి తదితరులు అనేక సాంకేతిక అంశాలను వివరించారు.