Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలల నుంచి పైపైకే...
- హోల్సేల్లో రూ.5.35.. రిటైల్లో రూ.5.95
- గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క గుడ్డు రూ.6 నుంచి రూ.7
- సగానికి తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన వినియోగం
- మరో ఆరు నెలలు ఇదే పరిస్థితి
- ఉత్పత్తి సగానికి తగ్గింది : పౌల్ట్రీ యాజమాన్యాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండి ఆపదలో ఆదుకునే కోడి'గుడ్డు'కు రెక్కలొచ్చాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా గుడ్ల ధరలు అమాంతం పెరుగుతుండడంతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు మండుతున్న కూర'గాయలు', నిత్యావసర వస్తువులు, మటన్, చికెన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కోడిగుడ్లతోనైనా సరిపెట్టుకుందామన్న పేద ప్రజల ఆశలపై పెరిగిన ధరలు నీళ్లు చల్లుతున్నాయి. చలితీవ్రత ఎక్కువగా ఉండడం, డిమాండ్ సరిపడా ఉత్పత్తి తక్కువగా ఉండడం, రెట్టింపైనా వినియోగంతో గుడ్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హౌల్సేల్ ధర రూ.5.35 ఉండగా రిటైల్లో రూ.5.95 ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 నుంచి రూ.7 విక్రయిస్తున్నారు. కాగా, గడిచిన ఆరు నెలలుగా కోడి గుడ్డు ధర ఎకబాకుతున్నది. గత నెల వరకు గుడ్డు హౌల్సేల్ ధర రూ.3.60 ఉండగా, నవంబర్ 1 నాటికి అది రూ.4.27కు చేరింది. ప్రస్తుతం రూ.5.35 పలుకుతున్నది. రిటైల్ మార్కెట్లో రూ.4 నుంచి ఒక్కసారిగా రూ.5.95కు ఎగబాకింది. దీంతో చిల్లర వర్తకులు, గ్రామీణ ప్రాంతాల్లో కిరాణషాపు నిర్వాహకులు ఒక్కో గుడ్డును రూ.6 నుంచి రూ.7 వరకు అమ్ముతున్నారు. ప్రతియేటా చలికాలం సీజన్లో గుడ్డు ధర పెరగడం సాధారణమైనప్పటికీ ఈ సారి మాత్రం రికార్డుస్థాయిలో పెరగడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. చలికాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే రానున్న మూడు నెలల్లో 'గుడ్లు' తేలేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సగానికి తగ్గిన ఉత్పత్తి..
రాష్ట్రంలో కోడిగుడ్ల ఉత్పత్తి సగానికి పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 4 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇందులో కోటి గుడ్లను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కోల్కత్తాకు ఎగుమతి చేస్తారు. రాష్ట్రంలో 3 కోట్ల వరకు వినియోగం ఉంటుంది. ఒక్క హైదరాబాద్లోనే రోజుకు సగటున 1.35 కోట్ల గుడ్ల వరకు డిమాండ్ ఉంటుంది. అయితే మూడేండ్లుగా పౌల్ట్రీ వ్యాపారం బాగా దెబ్బతిన్నది. కోళ్లకు రోగాలు రావడం, నిర్వహణ ఖర్చులు రెట్టింపు కావడంతో వ్యాపారులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. ఇక పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ఒడిదుడుకులు పౌల్ట్రీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేశాయని హయత్నగర్లోని సుబేదుల్లా పౌల్ట్రీ ఇండిస్టీస్ చైర్మెన్ మహ్మద్ రజూల్ 'నవతెలంగాణ'కు తెలిపారు. పరిస్థితి ఇలా ఉంటే, చిన్న వ్యాపారులు సైతం ఉత్పత్తికి దూరమవడం అదే సమయంలో చలికాలం రావడంతో మార్కెట్లో గుడ్డు వినియోగం బాగా పెరిగింది. ప్రజల్లోనూ రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చనే భావన ఏర్పడింది. బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు గుడ్డు మంచి పౌష్టికాహారం కావడంతో వీటిని తినే వారి సంఖ్య విపరీతంతో పెరిగింది. అంతేకాకుండా గతంలో అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి మూడుసార్లు గుడ్లు అందిస్తే.. ఇప్పుడు ప్రతిరోజు ఇస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు గుడ్లు తప్పనిసరి చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ గుడ్లను పంపిణీ చేస్తున్నారు. కానీ, మార్కెట్లో మాత్రం డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడంతో 'గుడ్డు' కొండెక్కింది. అదీ గాక, 2012 నుంచి పౌల్ట్రీ రైతులు నష్టాలు వస్తున్నాయన్న కారణంతో కోడిపిల్లల పెంపకాన్ని తగ్గించడం కూడా గుడ్లు అందుబాటులో లేకపోవడానికి, ధర పెరగడానికి ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు గుడ్ల కొనుగోలుకు ప్య్రాధాన్యత ఇస్తుండడం కూడా ధర పెరుగుదలకు మరో కారణమని తెలుస్తున్నది. ఇక, తమిళనాడు కరువు బారిన పడటం, అక్కడ బీఫ్ నిషేధించడంతో చికెన్కు డిమాండ్ ఊపందుకోవడం కూడా కోడిగుడ్డు ధరలు పెరగడానికి కారణమను మరికొందరు వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఇంత ఎన్నడూ చూడలేదు
గుడ్డు ధర ఇంత పెరగడం ఎప్పుడు చూడలేదు. చలితీవ్రత ఎక్కువగా ఉండడం, డిమాండ్కు తగ్గ సప్లరు లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. నెల రోజులుగా వ్యాపారం అంతంతే ఉంది. గుడ్లు దించేటప్పుడు, ఎక్కించేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒక్కో గుడ్డును పగిలిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్పత్తి పెరిగితే గుడ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.
- సయ్యద్ ఇక్రముల్లా, ఎంవీఆర్ ఎగ్సెంటర్, నాగోల్.
మరో ఆరు నెలలు ఇంతే
మరో ఆరు నెలల వరకు గుడ్ల ధరలు తగ్గే అవకాశం లేదు. గత మూడేండ్ల నుంచి పౌల్ట్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది రైతులు పెట్టుబడి పెట్టలేక కోళ్ల పెంపకాన్ని నిలిపివేయడంతో గుడ్ల ఉత్పత్తి కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి.
-జే. భాస్కర్రావు, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి