Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త పింఛన్ విధానం రద్దు కోసం దశలవారిగా ఆందోళనలు
- అయినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
- సీపీఎస్ రద్దు కోసం నేడు ఉద్యోగ, ఉపాధ్యాయుల చలో హైదరాబాద్
- జిల్లాల్లో మొదలైన అరెస్టులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాత పింఛన్ విధానం అమలు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు పిడికిలి బిగించారు. రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని ఇప్పటికే దశలవారి పోరాటాలు జరుగుతున్నా, ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల ఐక్య ఉద్యమం ఆధ్వర్యంలో 31 సంఘాలు నేడు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. మొదట్లో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చినా, సమావేశాలు అర్థాంతరంగా ముగించడంతో ఈ కార్యక్రమాన్ని చలో హైదరాబాద్గా మార్చారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చినా, మహబూబాబాద్, మధిర తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలను గురువారం రాత్రి అరెస్టు చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల మంది, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 28 లక్షల మంది కలిపి మొత్తం 44 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీపీఎస్ విధానంలో ఉన్నారు. తెలంగాణలో 1.17 లక్షల మంది, ఏపీలో 1.56 లక్షల మంది కలిపి తెలుగు రాష్ట్రాల్లో 2.73 లక్షల మంది సీపీఎస్ పరిధిలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 22, 2004న 653, 654, 655 జీవోల ద్వారా కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను అమల్లోకి తెస్తున్నట్టు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 1, 2004 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో సెప్టెంబర్ 1, 2004 నుంచి నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్ వర్తిస్తున్నది. ఈ విధానంతో ఉపాధ్యాయులకు పింఛన్ అందడంపై నీలినీడలు అలుముకున్నాయి. పాత పింఛన్ విధానం ప్రకారం ఉద్యోగి చివరి వేతనంలో సగం పింఛన్ రూపంలో వచ్చేది. కానీ సీపీఎస్ ద్వారా అలాంటి అవకాశం లేదు. నాటి మార్కెట్ షేర్ విలువల ప్రకారం పింఛన్ పొందే అవకాశమున్నది. ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో ఉండి రిటైర్ అయిన వారికి రూ.5వేల లోపు పింఛన్ తీసుకుంటున్న వారే అధికంగా ఉన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన మొదలై, ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం దేశంలో పాత పింఛన్ విధానం త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సీపీఎస్ రద్దు కోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం సీపీఎస్ విధానాన్ని బహిరంగంగానే సమర్థిస్తున్నది.
దశలవారి పోరాటం...
రాష్ట్రంలో సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు దశలవారి ఆందోళనలు నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 8,9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. సెప్టెంబర్1న పింఛన్ విద్రోహ దినం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ల వద్ద పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించారు. సమస్యను అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు అందించారు. అయినా ఈ సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగలేదు. దీంతో ఈనెల 24న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. అయితే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడటంతో చలో హైదరాబాద్గా కార్యక్రమంగా మార్చారు. శుక్రవారం ఉదయం 10:30గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు.
ఇదేం ప్రజాస్వామ్యం: చావ రవి, ఉపాధ్యాయ సంఘం నేత
సీపీఎస్ రద్దు కోసం చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సదస్సు నిర్వహిస్తున్నాం. దీనికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయినా అరెస్టులు చేయడం సరికాదు. ఇప్పటికే మహబూబాబాద్, మధిరలో ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. వికారాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పోలీసులు హైదరాబాద్ పోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ప్రభుత్వం చేయడం సరికాదు. వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి.