Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని భద్రతా అధికారులు నో, ఇవాంక భద్రతా అధికారులు ఎస్
- ఫలక్నుమా వరకు వీఐపీల కాన్వారులలో సెల్ జామర్లు
- పాతబస్తీలో ఇవాంకకు వెల్కమ్ పలకండి: పోలీసుల ప్రచారం
- మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్ వరకు మెట్రో మార్గం ఎస్పీజీ ఆధీనంలోకి...
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
ఓ వైపు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సుకు వచ్చే వీఐపీలకు భద్రతా ఏర్పాట్లు..మరోవైపు మెట్రోరైల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లతో కేంద్ర, రాష్ట్ర భద్రతా అధికారులు సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 28న పాతబస్తీలోని ఫలక్నుమా ప్యాలెస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, వైట్హౌజ్ సలహాదారు అయిన ఇవాంక తో పాటు ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలకు ప్రధాని నరేంద్రమోడీ విందు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో హైటెక్సిటీ నుంచి ఫలక్నుమా వరకు రోడ్డు మార్గాన వీవీఐపీలు విచ్చేస్తుండటంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లను చేస్తున్నారు. వీవీఐపీల కాన్వారులను ఫలక్నుమా ప్యాలెస్కు ఒక కి.మీ. ముందే నిలిపేసి అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో వారిని ప్యాలెస్లోకి తీసుకెళ్లడానికి సెక్యూరిటీ విభాగాలు యోచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ, ఇవాంక ట్రంప్లను ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బగ్లీలో ప్యాలెస్లోకి తీసుకెళ్లడానికి రిసెప్షన్ కమిటీ యోచన చేసిందని తెలిసింది. అయితే ఇందుకు ఇవాంక వ్యక్తిగత భద్రతను పర్యవేక్షించే యూఎస్ సీక్రెట్ సర్వీసు అధికారులు సమ్మతించారని తెలుస్తున్నది. కాని ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) అధికారులు ందుకు నో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందుకు గల ప్రత్యేక కారణాల గురించి వివరించకుండానే ఈ ప్రతిపాదనకు వారి నుంచి సమ్మతి లభించలేదని తెలిసింది. ఇదిలా ఉంటే మోడీ, ఇవాంకలతో ఇతర అంతర్జాతీయ బిజినెస్ మాగెట్లు రోడ్డు మార్గం ద్వారానే మాదాపూర్ హెచ్ఐసీసీ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వరకు రోడ్డు మార్గం ద్వారానే వచ్చి వెళ్లనున్నారు. ఈ మార్గాన్ని పూర్తిగా వీఐపీ హై సెక్యూరిటీ జోన్గా నిర్ణయించారు. అంతేగాక ముందు జాగ్రత్త చర్యగా వీవీఐపీల కాన్వారులలో ఆధునిక సెల్ జామర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరి కాన్వారు సాగే మార్గాలను కలిసే ఇతర మార్గాలను పూర్తిగా మూసేయనున్నారు. 28వ తేదీ రాత్రి8.00 గంటల నుంచి 10.00 గంటలకు విందు ఉండటంతో ఈ మార్గంలోకి ఇతర వాహనాలు రాకుండా సాయంత్రం నుంచే ట్రాఫిక్ అధికారులు కట్టడి చేయనున్నారని తెలిసింది. అలాగే ఈ హై సెక్యూరిటీ జోన్ మార్గంలో పలు భవనాలపై అడుగడుగునా శక్తివంతమైన బైనాక్యూలర్స్తో సెక్యూరిటీ విభాగం అధికారులు పరిసరాలపై డేగ కన్నేసి ఉంచుతున్నారు. అత్యవసరమైతే ఆయుధాలను కూడా ఉపయోగించడానికి వారికి అనుమతిని కూడా ఇచ్చినట్టు తెలిసింది. కాగా ప్రధాని కాన్వారుతో పాటు ఇవాంక కాన్యారులో అదనంగా సుశిక్షితమైన ఎస్పీజీ, గ్రేహౌండ్స్ కమెండోలతో పైలెట్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా మియాపూర్టూ నాగోల్ మెట్రోరైల్ కు 28వ తేదీ మధ్యాహ్నం ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపనున్నారు. ఆ మార్గాన్ని ఇప్పటికే ఎస్పీజీ అధికారులు క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. ముఖ్యంగా మియామపూర్ మెట్రో స్టేషన్లో ప్రారంభోత్సవం జరిగాక అదే ట్రైన్లో ఎస్ ఆర్ నగర్ వరకు పది కిలోమీటర్ల వరకు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్లు ప్రయణిస్తుండటంతో ఆ మార్గాన్ని అడుగడుగునా భద్రతా చట్రంలోకి తీసుకు వచ్చారు. ఈ విషయంలో స్థానిక పోలీసులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎస్పీజీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. కాగా పాతబస్తీలో అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక పర్యటన ఉండటంతో ఆమెకు వ్యతిరేకంగా ఏవైనా ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలోను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కన్నేసింది. అలాంటి పరిస్థితి ఏమీ లేదని హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ నుంచి కూడా సమాచారం అందుకున్న నిఘా అధికారులు మరో వైపు ఇవాంక రాకను హర్షిస్తూ స్థానికులు తమ బస్తీలలో వెల్కమ్ కటౌల్లు, బ్యానర్లు, ప్లేకార్డులతో ప్రదర్శన చేసేలా స్థానికులను సమాయత్తం చేస్తున్నట్టు తలెఇసింది. ఇందు కోసం పాతబస్తీలోని వివిధ పోలీసు స్టేషన్లలో గతంలో పనిచేసి ప్రజలతో సన్నిహితంగా ఉన్న కొందరు డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్ కేడర్ ఎస్పీ స్థాయి అధికారులకు ఈ అసైన్మెంట్ అప్పగించారని విశ్వసనీయ సమాచారం.