Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాల భర్తీ గాలికి..
- 'మిషన్' కాంట్రాక్టర్లపైనే శ్రద్ధ: ప్రొ.కోదండరామ్
నవతెలంగాణ-రామాయంపేట
''ఇంట్లో ఒక్క ఉద్యోగం వస్తే ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. లక్షలాది ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తే లక్షలాది కుటుంబాలు బాగుపడతాయి. ఫలితంగా తెలంగాణ సమాజం అభివృద్ధి చెందుతుంది. ఇది జరగాలంటే నిరుద్యోగులంతా కొలువుల కోసం సర్కారుపై నిరంతరం పోరాడాలి'' అని జేఏసీ చైర్మెన్ కోదం డరామ్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం విలేకర్లతో ఆయ న మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, 650 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారని వాపోయారు. కొత్తగా ఏర్పాటైన జిల్లా, డివిజన్, మండలాల్లో, గురుకులాల్లో, తదితర రంగాల్లో సుమారు మూడు లక్షల వరకు ఉద్యోగ ఖాళీలున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం 17వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో కాంట్రాక్టర్లకు పెద్దఎత్తున దోచి పెడుతున్నారని, ఆ డబ్బుతో నిరుద్యోగ సమస్య తీర్చవచ్చునని అన్నారు. మిషన్ భగీరథకు రూ.7వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, ప్రణాళిక ప్రకారం ఖర్చు చేస్తే కేవలం రూ.15 వందల కోట్లతో పూర్తి చేయవచ్చునని చెప్పారు. కాంట్రాక్టర్లపై ఉన్న శ్రద్ధ, ఉద్యోగ కల్పనపై సర్కారు చూపెట్టట్లేదని విమర్శించారు. కొలువుల కోసం కొట్లాట నిరంతరం సాగుతుందని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగాలకు ఒప్పుకునేదే లేదని చెప్పారు. ఇప్పటికే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్లో పని చేస్తున్నవారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటీర పరిశ్రమ, చిన్నతరహా పరిశ్రమలను అభివృద్ది చేయాలని రాష్ట్ర సర్కారుకు సూచించారు. వ్యవసాయనికి ఆదాయ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కొలువుల కొట్లాట సభకు కోర్టుద్వారా పర్మిషన్ తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ నెల 30న హైదరాబాద్లో జరిగే కొలువుల కొట్లాల సభకు యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో జేఏసీ జిల్లా అధ్యక్షులు సడిమెల యాదగిరి, కార్యదర్శి సుధాకర్, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కుమార్సాగర్, బీసీ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారాం, టీవీపీ జిల్లా అధ్యక్షుడు బాల్రాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు.