Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28న మధ్యాహ్నం మెట్రో ప్రారంభం
- గ్లోబల్ సదస్సుకూ హాజరు: సమీక్షలో సీఎస్ ఎస్పీ సింగ్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 28న ప్రధాని మోడీ హైదరాబాద్కు మధ్యాహ్నం 2.30కు మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి మియాపూర్కు మోడీ హెలికాప్టర్లో వెళ్లనున్నారు. మియాపూర్లో మెట్రోరైలు పైలాన్ను ప్రారంభిస్తారు. అనంతరం మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకు మెట్రోరైలులో ప్రధాని ప్రయాణిస్తారు. తిరిగి అదే మెట్రో రైలులో కూకట్పల్లి నుంచి మియాపూర్ చేరుకుంటారు. తర్వాత మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి హెలికాప్టర్లో వెళ్తారు. సాయంత్రం నాలుగు గంటలకు వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొంటారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ తెలిపారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇందులో డీజీపీ మహేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, అజరు మిశ్రా, రాజ్భవన్ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్ సింగ్ , ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా, సునీల్శర్మ, జయేష్ రంజన్ , కార్యదర్శులు నవీన్ మిట్టల్, బి.వెంకటేశం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరులు యోగిత రాణా, రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాలు , మియాపూర్ , హెచ్ఐసీసీ, పలక్ నుమా ప్యాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లపై చర్చించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధానమంత్రికి స్వాగతం చెప్పడానికి ఘనమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బేగంపేట విమానాశ్రయం వద్ద ప్రధానికి రాష్ట్ర గవర్నర్ , ముఖ్యమంత్రి , క్యాబినెట్ మంత్రులు స్వాగతం పలకనున్నట్టు తెలిపారు. ఈ నెల 28 న మధ్యాహ్నం ప్రధాని మెట్రో రైల్ను ప్రారంభించిన అనంతరం హెచ్ఐసీసీలో జరిగే గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్ లో పాల్గొంటారని సీఎస్ తెలిపారు. ఈ సమ్మిట్లో అమెరికా అధ్యక్షుల సలహాదారు ఇవాంకా ట్రప్ పాల్గొంటారని చెప్పారు. ప్రధాని పర్యటించే మార్గంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటించే మెట్రో రైల్ ను అందంగా అలంకరించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించే ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధానమంత్రి సందర్శిస్తారని అన్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. వివిధ సంస్ధల సి.ఇ.ఓ లతో ద్వైపాక్షి క సమావేశంలో పాల్గొంటారని అన్నారు. అతిధులకు గోల్కోండ కోటలో ఇచ్చే విందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విందు తర్వాత శంషాబాద్ విమానాశ్రయం వెళ్లి.. అక్కడి నుంచి మోడీ ఢిల్లీ వెళ్లనున్నారు
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని నగర పర్యటన, మెట్రో రైలు ప్రారంభోత్సవం, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభలు, ఇతర అంశాలపై సీఎం గవర్నర్తో చర్చించినట్టు తెలిసింది. ఈనెల 29న జిఇఎస్ అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో విందు ఇవ్వబోతుందని, దానికి రావాల్సిందిగా గవర్నర్ను సీఎం ఆహ్వానించారు. ప్రధాని ప్రారంభించే మెట్రోరైలు కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీఎం కోరారు. గవర్నర్ను మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య గురువారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.