Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు యూనివర్సిటీలో కవులు, సాహితీవేత్తల ధర్నా
- దరఖాస్తు చేసుకున్నఅందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ తెలుగు మహాసభల్లో కవులు, సాహితీవేత్తలకు ఘోర అవమానం జరిగింది. ఒకే శాలువా, ఒకే బోకేతో సుమారు 250 మంది కవులను తూతూమంత్రంగా సన్మానించడం గమనార్హం. ఈ ఘటన తెలుగు యూనివర్సిటీలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 8వేల మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు వివిధ అంశాల్లో ప్రదర్శనలిస్తామని పేర్లు నమోదు చేసుకున్నారు. మూడు రోజులుగా వివిధ వేదికలపై జరుగుతున్న కవిసమ్మేళనాలు, సదస్సుల్లో పలువురికి అవకాశం కల్పించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవిసమ్మేళనం జరుగుతున్నది. దూరప్రాంతాలనుంచి వచ్చిన చాలామంది కవులకు అవకాశం దక్కలేదు. దీనిలో అవకాశం రాని వారికి తెలుగు యూనివర్సిటీలో ఉంటుందని చెప్పడంతో కవులంతా వర్సిటీకి వచ్చారు. నిర్వాహకుల దగ్గరకు వెళ్లి అవకాశం కల్పించాలని కోరారు. తామంతా ముందుగానే కవిత్వాలు చదువుతామని ఆన్లైన్లోనే నమోదు చేసుకున్నామని, అయినా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యం కాదనీ, పేర్లు నమోదు చేసుకున్న అవకాశం రాని వారికి ప్రత్యేకంగా మరో వేదికపై కవితలు చదివే అవకాశంతో పాటు సన్మానాలు చేస్తామని చెప్పారు. వర్సిటీలోని మొదటి అంతస్తులో ఓ గదిలో అందరినీ ఒకేచోట వరుసగా కూర్చోబెట్టి ఒక్కొక్కరి సన్మానాలు చేశారు. అయితే ఒకే శాలువా, ఒకే బోకేతోనే వారందరినీ సన్మానించినట్టు వారు తెలిపారు. సన్మానం చేసినట్టు కనీసం శాలువా, పుష్పగుచ్చం కూడా ఇవ్వకపోవడంతో వారంతా ఆవాక్కయ్యారు. సాధారణంగా సన్మానం చేసిన వారికి రూ.3వేలు నగదు, శాలువా, బోకే, జ్ఞాపిక అందజేస్తారు. ఇవన్నీ ఏమి లేకపోవడంతో దీన్ని అవమానకరంగా భావిస్తూ వారంతా తెలుగు యూనివర్సిటీ ఆవరణలో ధర్నా నిర్వహించారు. అందరికీ సమానం అవకాశం కల్పింంచాలనీ, ప్రాంతాలకతీతంగా కవులు, కళాకారులకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మర్యాదకు లోటు వద్దని సీఎం కేసీఆర్ పలు మార్లు ఆదేశించినా నిర్వాహకులు చిన్న శాలువా ఇచ్చే దగ్గర కక్కుర్తి పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆందోళన చేస్తున్న వారి వద్దకు వర్సిటీ వీసీ ఎస్వీసత్యనారాయణ చేరుకుని, ఆవేశంగా మాట్లాడంపై కవులు తీవ్రంగా మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న కవులు, సాహితీవేత్తలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
గొంతెమ్మ కోర్కెలు వద్దు
నమోదు చేసు కున్న 8వేల మందికి అవకాశం కల్పించడం 80రోజులు పెట్టినా సాధ్యం కాదు. కాబట్టి లిస్టుల్లో లేనివారికి అవకాశం కల్పించే ఉద్దేశంతో వర్సిటీలో ప్రత్యేకంగా కవితలు చదివేఅవకాశం ఇచ్చాం. ఇప్పటికిప్పుడు సిగరెట్ పెట్టే మీద కవితలు రాసుకుని వచ్చి అవకాశం ఇవ్వాలంటే సాధ్యం కాదు. దీనికితోడు మూడు వేలు నగదు, శాలువా, బోకే ఇవ్వాలని గొంతెమ్మ కొర్కెలు కోరొద్దు. మెదడుకు ఖరీదు కట్టొద్దు.
-తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ
కవులను కించపరచొద్దు
కవిత్వాలు చదివేందుకు ముందుగా దరఖాస్తు చేసుకున్నం. అవకాశం ఇవ్వడం లేదు. అసలు ఇస్తారో లేదో కూడా చెప్పడం లేదు. ఒక రూములో బంధించి, సామూహిక సన్మానం పేరుతో కవులను కించపరచడం సరికాదు. నిర్వహకులు తమ వైఖరి మార్చుకోవాలి.
- పండరినాథ్, వికారాబాద్
అందరినీ సమానంగా చూడాలి
అన్లైన్లో అందరం దరఖాస్తు చేసుకున ్నం. కానీ అవకాశం మాత్రం కొద్ది మందికే, నిర్వాహకులకు తెలిసి వారికే ఇస్తున్నరు. ఇది సరికాదు. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. చీకటిగదుల్లో ఎవరికీ తెలియకుండా కవులను బంధించి సన్మానాలు చేయడం అవమానించడమే.
-ఎల్ వెంకన్న, ఇల్లెందు
మహిళలకు అవకాశం ఇవ్వడం లేదు
ఎంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన కవులను ఇక్కడ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. శనివారం రాత్రి వరకు అవకాశమిస్తామని చెప్పి, అర్ధరాత్రి తర్వాత ఇది పురుషులకు మాత్రమే అని చెప్పారు. ఇది పూర్తిగా పురుషుల కవి సమ్మేళనంగా మారింది. మహిళలకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు.
-నీలవేణి, కడపతెలంగాణ వారికీ అవకాశమివ్వడం లేదు
తెలంగాణలో నిర్వహిస్తున్న తెలుగు మహాసభల్లో తెలంగాణకు చెందిన కవులకు అవకాశం ఇవ్వడం లేదు. కవులు, సాహితీ వేత్తలంటే కనీసం గౌరవం కూడా లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నం. ప్రతినిధి కార్డు, కిట్టు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఎంతో చేయాలను కుంటున్నరు. ఇదంతా నడుమ ఉన్న వారు ఇలా చేస్తున్నారు. -గంట జ్యోతి, నిజామాబాద్
ఏప్రాతిపదికన ఎంపిక చేశారో చెప్పాలి
ప్రస్తుతం కవి సమ్మేళనాల్లో కవితలు చదివే వారిని ఏ ప్రాతి పదికన ఎంపిక చేశారో చెప్పాలి. చాలా మంది పెద్దపెద్ద కవులకూ, సాహితీవేత్తలకు కూడా అవకాశం ఇవ్వలేదు. కవులు, కళాకారులను సన్మానాలు చేసేందుకు బడ్జెట్ లేదని చెప్పడం సరికాదు. ఇంతపెద్ద కార్యక్రమానికి రూ.250లతో శాలువ కూడా ఇవ్వలేరా..? -నాగస్త్ర్, ఏలూరు