Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామకిష్టయ్య కమిటీ ప్రతిపాదన
- ప్రభుత్వ పరిశీలన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (టీఎస్సీఎస్) ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు వి రామకిష్టయ్య నేతృత్వంలో అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉండాలని రామకిష్టయ్య కమిటీ ప్రతిపాదించింది. ఈ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అఖిల భారత స్థాయిలో యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్ను ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్ ఉంది. అదే తరహాలో తెలంగాణలోనూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉండాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. తాజాగా రామకిష్టయ్య కమిటీ నివేదిక సమర్పించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఏటా తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహించనుంది. స్టేట్ సివిల్ సర్వీసెస్కు కచ్చితమైన షెడ్యూల్ను పాటించి విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరిధిలో గ్రూప్-1 పోస్టులు వెళ్లే అవకాశముంది. దీంతో సివిల్ సర్వీసెస్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాతే తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా యూపీఎస్సీ స్టాండింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ, రాస్ట్రాల పీఎస్సీల సిలబస్ ఒకటే ఉండాలని నిర్ణయించింది.
దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వేరే సిలబస్, రాష్ట్రాల్లోని ఉద్యోగాలకు మరో సిలబస్ చదవాల్సిన అవసరం ఇక ఉండదు. ఒకే సిలబస్ చదివితే అటు యూపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు, ఇటు రాష్ట్రాల పీఎస్సీలు నిర్వహించే రాతపరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కలుగుతుంది. నిరుద్యోగులకు సిలబస్ భారం తగ్గుతుంది. త్వరలోనే ఒకటే సిలబస్ అమల్లోకి రానుంది.