Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మగౌరవ పోరాటానికి
అందరూ కలిసిరండి: రేవంత్రెడ్డి పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్వరాష్ట్రం కోసం ఆరవై ఏండ్ల పాటు అలుపెరగక పోరాడిన తెలంగాణా ప్రజలు ఆత్మగౌరవాన్నే ఆది నుంచి కోరుకుంటున్నారని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మగౌరవంతో బతికే అవకాశం లేకపోగా అణచివేసి ప్యూడల్ విధానంలో రాష్ట్ర పరిపాలన కొనసా గుతోందన్నారు. దీనిని అంతమొందించే రాజకీయ పునరేకీకరణ పోరాటం మరింతగా ప్రజ్వరిల్లాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా నూతన తెలంగాణా రాష్ట్రంలో కూడా అత్యధికంగా నష్టపోతున్నది పాలమూరు, రంగారెడ్డి జిల్లాలే అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ నేతలు పాలమూరు, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి విషయంలో ఎన్నో హామీలిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటిదాకా ఎలాంటి నీటి వనరులు లేక బీడు వారిన కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్నగర్, కొడంగల్, దేవరకద్ర, నారాయణ పేట, తాండూరు, చేవెళ్లలాంటి అన్ని ప్రాంతాలకు నీళ్లు గలగలమంటూ చేరుకుంటాయని ఎన్నో కథలు చెప్పారన్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని దాని కోసం ఆర్టీఎస్ గట్టుపై కుర్చీ వేసుకూర్చుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ తాను అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరిచిపోయారన్నారు. పాలమూరు జిల్లాలో వలసలు ఆగలేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ వైఫల్యాలు ఇంకెన్నో ఉన్నాయని, ఈ నేపథ్యంలో రాజకీయ పునరేకీకరణ చారిత్రాత్మక అవసరమైన ఈ తరుణంలో ప్రస్తుతం మొదలైందన్నారు. 2019లో జరిగే తెలంగాణ తుది దశ ఉద్యమంతో దొరల గడీల పునాదులను పెకిలించాలన్నారు. తెలంగాణాను ఇచ్చిన సోనియాగాందీ ఇప్పించిన రాహుల్ గాంధీలనాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ ఆశయసాధనంలో భాగంగా జడ్చర్ల జనగర్జనసభకు పెద్ద ఎత్తున తరలి రావాలఇ, ప్రజాకంటక పాలనలను అంతమొందించడానికి కొనసాగే ఈ సమరానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని, ప్రజాబలం ఏమిటో సర్కారుకు చాటి చెప్పాలని ఆయన కోరారు.