Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంద్, ర్యాలీలతో అట్టుడుకిన కారేపల్లి
- అడ్డుకున్న పోలీసులు..అదుపులో పలువురు నాయకులు
- విడుదల చేయాలని రాస్తారోకో
- ఖమ్మం జిల్లాకు పాకిన 'ఆదిలాబాద్' లొల్లి
నవతెలంగాణ-కారేపల్లి
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలకు, లంబాడీలకు మధ్య జరిగిన వివాదర ఖమ్మం జిల్లాకూ పాకింది. సోమవారం ఇరు గ్రూపులు పోటాపోటీగా ర్యాలీలు, రాస్తారోకోలు, బంద్కు పిలుపునివ్వడంతో కారేపల్లి మండలం అట్టుడుకింది. రెండ్రోజుల కిందట లంబాడీలు తలపెట్టిన బంద్ విజయవంతమవడంతో సోమవారం వేలాది మందితో ర్యాలీ తీసేందుకు లంబాడీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇదే క్రమంలో ఆదివాసీ జేఏసీ ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చింది. రెండు గ్రూపులు ఒకేసారి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం తో కారేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందస్తుగానే 144సెక్షన్ విధించి ప్రచారం నిర్వహించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. బంద్ జయప్రదం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి వట్టం నాగేశ్వర రావు, అలెం లింగరాజు, పొదెం రాంమ్మూర్తి, కల్తి రాంప్రసాద్ ఆధ్వర్యంలో దుకాణాలు మూసేందుకు యత్నిస్తుండగా పోలీసులు 50మందిని అదుపులోకి తీసుకుని కారేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం మేరకు పేరుపల్లి, గాంధీనగర్, కారేపల్లి, గేటుకారేపల్లి గ్రామపంచాయతీలకు చెందిన వందలాది మంది ఆదివాసీలు వాహనాల్లో కదిలి వచ్చి కారేపల్లి క్రాస్ రోడ్లో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ నరేష్రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి ఆదివాసీలతో చర్చలు జరిపారు. 144సెక్షన్ అమలులో ఉందని, ర్యాలీలు చేపట్టొద్దని వారించారు. పోలీసుల అదుపులో ఉన్న తమ నాయకులను విడుదల చేస్తే తిరిగి వెళ్తామంటూ తెగేసి చెప్పడంతో అదుపులో ఉన్న వారిని విడుదల చేశారు. అనంతరం ఆదివాసీలు అక్కడ్నుంచి వెళ్లారు.