Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిల్ తిరస్కరణ..29 వరకు రిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆదివారం అర్థరాత్రి ట్యాంక్బండ్ ముట్టడికి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగతోపాటు కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల అదుపులోవున్న మంద కృష్ణను అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 29 వరకు రిమాండ్ విధించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్లోని సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్లోఎమ్మార్పీఎస్ కార్యకర్త ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి సంస్మరణ సభ ముగిసిన అనంతంరం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ట్యాంక్బండ్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఒక్కసారిగా వేలాదిమంది కార్యకర్తలు రోడ్లమీదికి వచ్చారు. దీంతో సికింద్రాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదివారం అర్థరాత్రి అనూహ్య ర్యాలీ నిర్వహించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తెలుగు మహాసభల బ్యానర్లు, హోర్డింగులను ధ్వంసం చేశారు. పోలీసు బైకులకు నిప్పుపెట్టారు. ఈ విధ్వంసం నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించారంటూ రంగంలోకి దిగిన పోలీసులు అర్థరాత్రి మందకృష్ణ మాదిగను అరెస్టు చేసి కామాటిపురా పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి రామ్గోపాల్పేట్, ఖార్ఖానా, కామటిపురా, కంచన్బాగ్, బొల్లారం తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు. సోమవారం మందకృష్ణ మాదిగ సహా మరో 12 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని 11వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజీస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. మందకృష్ణ మాదిగ ప్రయత్నించిన ముందస్తు బెయిల్ను వివిధ కారణాలతో మెజిస్ట్రేట్ తిరస్కరించారు. దీంతో మందకృష్ణను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇదిలావుండగా పోలీసులు అధికారికంగా 12 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పుతుండగా పోలీసుల అదుపులో మాత్రం దాదాపు 150 మందికిపైగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఉన్నట్టు సమాచారం.