Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ తెలుగు మహాసభల ప్రతినిధుల అభిప్రాయాలు
నవతెలంగాణ - సిటీబ్యూరో
తెలుగు ప్రపంచ మహాసభలకు విచ్చేసిన అతిథులు సభల నిర్వహణకు ఫిదా అవుతున్నారు. వచన కవిత్వం, పద్య కవిత్వం, బాల, మహిళా సాహిత్యం ఇలా ఒకటేమిటీ... అనేక విధాల ప్రక్రియలను పలు వేదికలపై నిర్వహిస్తున్నందుకు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. భాషకు ఎల్లలు లేవని, ఏ దేశంలో ఉన్నా.. ఏ ప్రాంతంలో ఉన్నా... మాతృభాష పరిరక్షణకు ప్రతిఒక్కరం నడుం కట్టాలని మహాసభల ప్రతినిధులు పిలుపునిస్తున్నారు. మాతృభాషలో తప్పనిసరిగా చదవాలనే నిబంధనను ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో తీసుకురావాలని కోరుతున్నారు. భాష అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను మనతరం
భుజ స్కందాలపై వేసుకొని, భావితరాలకు తెలుగును బతికించి అందివ్వాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రతినిధులు వారి అభిప్రాయాల్లో ....
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ మన తెలుగు :
ప్రపంచ భాషల్లో తెలుగు తియ్యనైన భాష. ప్రపంచంలో ఇటలీ భాష తర్వాత మన తెలుగుకే ఆ స్థానం ఉంది. తెలుగుభాష అత్యంత తియ్యదనంగా, మాధుర్యంగా ఉంటుంది. అందుకే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా కీర్తిస్తారు. నేను స్వతహాగా హిందీ పండిట్ అయినప్పటికీ, మాతృభాషపైనున్న మమకారంతో ఈ మహాసభలకు హాజరయ్యాను. పద్యం, కవిత్వం చాలా ఇష్టం. రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది.
-పులి వెంకట సత్యానందం, హిందీ పండిట్, సూర్యాపేట జిల్లా.
అంతరించే భాషల్లో 139వ స్థానంలో-
తెలుగు నేలలో పుట్టినందుకు గర్విస్తున్నాను. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిన చైనా, జపాన్ దేశాల్లో కచ్ఛితంగా మాతృభాషలోనే చదవాలనే నిబంధనలున్నాయి. అలాగే తెలుగు ప్రభుత్వాలు కూడా 1-8 తరగతుల్లో తెలుగు మాధ్యమం చదివితేనే, పై చదువులకు అనుమతించేలా జీవో చేయాలి. అప్పుడు తెలుగుభాష బతుకుతుంది. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న భాషల్లో తెలుగు 139వ స్థానంలో ఉంది. ఇంటర్ ప్రథమ ఏడాదిలో మా ఉపాధ్యాయులు విజయ రాములు చెప్పిన అల్లసాని పెద్దన్న రెండో అతిపెద్ద పద్యాన్ని అప్పజెప్పి నేను కూడా ఒక కలాన్ని బహుమతిగా పొందాను.
- ఇందిరా, డీసీటీవో
సాహిత్యానికి పెద్దపీట :
ప్రపంచ తెలుగు మహాసభలకు ఇంతమంది కవులను ఆహ్వానించడం గొప్ప విశేషమే. కవులను సన్మానించడం సాహిత్యానికి పెద్దపీట వేసినట్టే. మంచి ఆతిథ్యం ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగం, గురువుకు పాదాభివందనం చేయడం మంచి పరిణామం. మహాసభలు ప్రారంభంలో వెలుగు జిలుగులను స్వయంగా చూసి తన్మయం చెందా. సీఎం కేసీఆర్ భాషాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయం.
- అనురాధ, ప్రముఖ కవయిత్రి, విజయవాడ
నా కవిత చదవలేకపోయా :
మా పూర్వీకులది చిత్తూరు జిల్లా మదనపల్లి. మేం స్థిరపడింది చెన్నైలో. తెలుగు సాహిత్యంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఒక్కో ప్రక్రియ నిర్వహణకు ఒక్కో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడం బాగుంది. తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయం. కవి సమ్మేళనానికి ముందుగా నా పేరు నమోదు చేసుకోవాలనే నిబంధన నాకు తెలీదు. కవిత చదవలేదనే బాధ కొద్దిగుంది.
- మోహనశ్రీ, మహిళా కళాశాల ప్రిన్సిపాల్, చెన్నై
మంచి కవిత్వం వస్తుంది :
ప్రపంచ తెలుగు మహాసభలు నభూతో నభవిష్యత్ అన్నట్టు గొప్పగా ఉన్నాయి. ప్రాంతీయ భేదాలు లేకుండా మంచి ఆప్యాయత, ఆదరణ లభిస్తున్నది. కవి సమ్మేళనాల ద్వారా మంచి కవిత్వాలు వస్తున్నాయి. మనం ఎక్కడ ఉన్నా.. మనమంతా తెలుగు వాళ్లమే. తెలుగు భాష అభివృద్ధికి జరుగుతున్న కృషి అభినందనీయం.
- ఆకుల రఘురామయ్య, కవి, అనంతపురం
యువకవులకు స్ఫూర్తిదాయకం
ప్రపంచ మహాసభలు యువ కవులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఇందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ఒక్క అంశం కదిలిస్తున్నది. పుస్తకాల్లో దొరకని సాహిత్యం, సందేశాలు ఇక్కడ సందడి చేస్తున్నాయి. కొత్త కొత్త భావజాలాలను అవగాహన చేసుకోవడానికి దోహదపడుతున్నది. ఎంతోమంది రాష్ట్రేతర, విదేశాలకు చెందిన కవులు పరిచయమవుతున్నారు. ఇదొక ప్రత్యేక కవిత్వ శిక్షణశాలగా భావించవచ్చు.
- డాక్టర్ ఏఏ నాగేంద్ర, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం.