Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల,మతశక్తులపై కొత్త ఏజెండాతో ముందుకు : అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్
- హెచ్సీయూలో ఘనంగా రోహిత్ వేముల వర్థంతి
- చనిపోయిన తర్వాతా భయపెడుతున్న రోహిత్: రాధిక
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
దేశంలో దళితులు, బడుగు బలహీన వర్గాల మీద వివక్ష పెరిగిపోతుందని, ప్రస్తుతం అది తారా స్థాయికి చేరిందని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. ఈ వివక్షకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ మద్దతు పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బుధవారం రోహిత్ వేముల రెండో వర్థంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో రోహిత్ వేముల తల్లి రాధిక వేములతో పాటు ప్రొఫెసర్ కంచ ఐలయ్య, మాజీ సీఎస్ కాకి మాధవ్రావు తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు హెచ్సీయూ ప్రధాన గేటు నుంచి వెలివాడ వరకూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడున్న రోహిత్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ....వివక్షకు వ్యతిరేకంగా కలిసి వచ్చేశక్తులతో పోరాడుతున్నామని, దీన్ని రూపుమాపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా ఏ సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తున్నట్టు చెప్పారు. దేశంలో కుల,మతశక్తులు పై చేయి సాధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయనీ వీటిని ఐక్యంగా అడ్డుకోవాలని కోరారు. దీనికి కొత్త ఎజెండాతోముందుకు పోతున్నట్టు చెప్పారు. రాధిక వేముల మాట్లాడుతూ...గతేడాది నివాళి అర్పించేందుకూ లోపలికి రానివ్వలేదని, ఈసారి విద్యార్థుల కోరిక మేరకు అనుమతించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మీడియాను అనుమతించనీ వీసీ అప్పారావు, పోలీసులకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. రోహిత్ వేముల చనిపోయిన తర్వాత కూడా కేంద్రంలోని బీజేపీ పాలకులను భయపెడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మాటలకు లొంగకుండా, బీసీ, మైనార్టీలతో కలిసి దళితులు రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని కోరారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య, మాజీ సీఎస్ కాకి మాధవరావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, హార్వర్డ్ స్కాలర్ సూరజ్ హెంగ్డె, తమిళనాడు గ్రేస్ బాను, అడ్వకేట్ జైభీంరావు, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధులు మున్నా, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.