Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెలాఖరులోగా సెట్ కమిటీల భేటీ
- త్వరలోనే విద్యార్థుల కోసం మాక్టెస్టులు
- ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆన్లైన్లో నిర్వహణ : ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలు (సెట్స్)-2018 నోటిఫికేషన్లు వచ్చేనెలలో ప్రకటించే అవకాశముంది. ఈనెలాఖరులోగా సెట్ కమిటీల భేటీలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సెట్స్ కన్వీనర్లు, టీఎస్టీఎస్, టీసీఎస్ అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం తనను కలిసిన విలేకరులతో పాపిరెడ్డి మాట్లాడుతూ సెట్ కమిటీల సమావేశం తర్వాత షెడ్యూల్ విడుదలవుతుందని అన్నారు. పాత జిల్లా కేంద్రాలన్నింటిలో పరీక్షా కేంద్రాలుంటాయని చెప్పారు. పరీక్షా కేంద్రాలను స్వయంగా కన్వీనర్లు పరిశీలించాలని కోరారు. మౌలిక వసతులు, కరెంటు సౌకర్యం, ఇంటర్నెట్, కంప్యూటర్లు, ఇతర వసతులను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు, పొరపాట్లు తలెత్తకుండా ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల కోసం త్వరలోనే మాక్టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు. టీఎస్సీహెచ్ఈ, సెట్స్ వెబ్సైట్లు, టీసీఎస్ ప్రత్యేక వెబ్సైట్ విద్యార్థుల కోసం అందుబాటులో ఉంటాయని అన్నారు. ఆ వెబ్సైట్లలో పాత ప్రశ్నాపత్రాలు 6,7 విద్యార్థుల కోసం పొందుపరుస్తామని చెప్పారు. ఎంసెట్ను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి విడత, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ఇంజినీరింగ్ రాతపరీక్షలను మూడు రోజులపాటు ఆరు విడతల్లో, అగ్రికల్చర్, ఫార్మసీ రాతపరీక్షలను రెండు రోజులపాటు మూడు లేదా నాలుగు విడతల్లో నిర్వహిస్తామని అన్నారు. ఐసెట్ మూడు విడతలు, ఎడ్సెట్ మూడు విడతల వారీగా జరుపుతామని చెప్పారు. విడతలో 25 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా విడతలు ఆధారపడి ఉంటాయని వివరించారు. సెట్స్ దరఖాస్తు ఫీజులపై సెట్ కమిటీలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీహెచ్ఈ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఎంసెట్ కన్వీనర్ ఎన్ యాదయ్య, ఐసెట్ కన్వీనర్ ఎం సుబ్రమణ్య శర్మ, లాసెట్ కన్వీనర్ ఎస్బి ద్వారకానాథ్, ఈసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్, పీఈసెట్ కన్వీనర్ వి సత్యనారాయణ, పీజీఈసెట్ కన్వీనర్ సమీనా ఫాతిమా, కో కన్వీనర్ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఎంసెట్, మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20వ తేదీ నుంచి పీఈసెట్, మే 25న లాసెట్, మే 26న పీజీలాసెట్, మే 27న పీజీఈసెట్, మే 31న ఎడ్సెట్ రాతపరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం విదితమే.