Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో కుంటుపడిన పాలన
- 40 వేల ఉద్యోగాలు ఎక్కడున్నాయని కడియం చెప్పడం దురదృష్టకరం : ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ - నారాయణగూడ
న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి 2015లో ఎంపికైన 3,100 మంది గ్రూప్-2 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అన్ఎంప్లాయీస్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోచక పోవడంతో రాష్ట్రంలో అభివృద్ధి, పాలన కుంటుపడ్డాయన్నారు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 40 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచడం లేదని మంత్రి కడియం శ్రీహరిని గుర్తుచేస్తే అన్ని ఖాళీలు ఎక్కడున్నాయని చెప్పడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే 40 వేల ఖాళీలు ఉన్నాయని, వాస్తవానికి వివిధ కేటగిరీల్లో 70 వేల ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం తమతో చర్చిస్తే వివరాలు బహిర్గతం చేస్తానన్నారు. వారం రోజుల్లో గ్రూప్-2 అభ్యర్థులపై ఉన్న హైకోర్టు స్టేను ఎత్తేసి ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.