Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంతో బలపడుతున్న బంధం
- కాళేశ్వరం అనుమతులకు నదుల అనుసంధానానికి లింక్?
- తెలంగాణకు తీరని నష్టమంటున్న సీనియర్ ఇంజినీర్లు
* కొండూరి రమేశ్బాబు
గోదావరి నదిపై అకినేపల్లి ప్రాజెక్టు నిర్మించటానికి కేంద్రం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతర్గతంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తున్నది. నదుల అనుసంధానంలో భాగంగా దుమ్ముగూడెం, తుపాకుల గూడెం బ్యారేజీల మధ్యలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకినేపల్లి బ్యారేజీని కేంద్రం ప్రతిపాదించింది. అకినేపల్లి నుంచి 177 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ టేల్పాండ్కు తరలించి అక్కడి నుంచి పెన్నా బేసిన్ ద్వారా కావేరీ బేసిన్కు తరలించే ఈ పథకానికి సంబంధించిన సాంకేతిక పరమైన నివేదికను కేంద్రం గత డిసెంబర్లోనే రూపొందించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతరాష్ట్ర నదుల అనుసంధానం 14 వ సమావేశంలో అకినేపల్లి-నాగార్జునసాగర్-కావేరి లింక్పైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కొన్ని అభ్యంతరాలతో కూడిన అర్థ అంగీకారాన్ని తెలిపారు. అకినేపల్లి ప్రాజెక్టు కోసం మరొక సాంకేతిక కమిటీ నియామించాలన్నారు. 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తున్నదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేయగా 110 సంవత్సరాల ప్రవాహ సగటు కాకుండా 40 సంవత్సరాల సరాసరి లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. గోదావరి నీటిలో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉన్నదని, మొత్తం 1600 టీఎంసీల నీరు తెలంగాణ వినియోగించుకున్న తర్వాత మిగిలిన నీటిని తీసుకోవచ్చన్నారు. ముందుగా మొదటి దశలో మహానది గోదావరి లింక్ను పూర్తి చేసిన తర్వాత రెండవదశలో గోదావరి, కృష్ణా, కావేరి లింక్ చేపట్టాలని సూచించారు. తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేని అకినేపల్లి ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వాదన ఉంటే బాగుండేదని కొందరు విశ్రాంత ఇంజినీర్లు అభిప్రాయ పడ్డారు.
రహస్య ఎజెండా...
అకినేపల్లి ప్రాజెక్టుకు అంగీకారం తెలపితేనే కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తామని కేంద్రం రహస్య నిబంధన పెట్టినట్టు తెలిసింది. దీనికి అంగీకరించిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టుకు వరుస అనుమతులు వస్తున్నాయని విశ్రాంత ఇంజినీర్లు భావిస్తున్నారు. కర్నాటకలో అధికార పీఠం దక్కించుకోవటంతో పాటూ తమిళనాడులో పాగా వేయటానికి ప్రయత్నిస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా గోదావరి-కావేరి లింక్ను తెరపైకి తెచ్చిందని వారంటున్నారు.
అకినేపల్లి ప్రతిపాదనకు అంగీకరించటం ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి చేరువ కావటానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదనే వాదనకు బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో డాక్టర్ రాజశేఖరెడ్డి దుమ్ముగూడెం- నాగార్జునసాగర్ టేల్పాండ్ ప్రాజెక్టును మంజూరు చేశారు. 160 టీఎంసీల గోదావరి నీటిని నాగార్జునసాగర్ వద్దకు తరలించే ఈ పథకాన్ని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఇదే స్వరూపం కలిగిన అకినేపల్లి ప్రతిపాదనకు ఇప్పుడు అంగీకారం తెలిపితే భవిష్యత్లో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని కొందరు ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. గోదావరిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతున్నదని, అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే దుమ్ముగూడెం ప్రాజెక్టుకు కూడా నీరందిచటం కష్టమని హైదరాబాద్ విశ్రాంత ఇంజినీర్ల ఫోరం అద్యక్షుడు దేవరుప్పల భీమయ్య అభిప్రాయపడ్డారు. అకినేపల్లిని పూర్తి గా వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఈ మేరకు మంత్రి హరీశ్రావుకు ఒక నివేదికను కూడా ఆయన అందచేశారు.
అకినేపల్లితో భారీ ముంపు...
గోదావరి నదిపై అకినేపల్లి ప్రాజెక్టు చేపడితే తెలంగాణలో ముంపు సమస్య తీవ్రంగా ఉంటుందని నీటిపారుదల శాఖ అంచనావేసింది. జయశంకర్ భూపలపల్లి జిల్లాలోని గోదావరికి రెండు వైపులా 45 గ్రామాలు ఈ ప్రాజెక్టు కింద మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రాథమిక అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు వల్ల 70 వేల ఎకరాలు ముంపునకు గురవుతుందని, నదీ ప్రవాహ ప్రదేశం పోనూ 40 వేల ఎకరాల భూమి మునుగుతుందని, ప్రాజెక్టు నిర్మాణంతో 55,000 మంది నిర్వాసితులవుతారని కేంద్రానికి పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం, వాజేడు, ములుగు నియోజకవర్గం పరిధిలోని మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో ముంపు గ్రామాలు అధికంగా ఉన్నాయి. ఇది గిరిజన ప్రాంతంలో ఉండటంతో భూసేకరణకు గ్రామసభల అనుమతి అవసరం. గతంలో ముంపు కారణంతోటే కంతనపల్లి ప్రాజెక్టును గిరిజనులు వ్యతిరేకించారు. అకినేపల్లి విషయంలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని గిరిజన సంఘాలు అంటున్నాయి.