Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికీ నిర్వహించని భాషా సాహితీవేత్తల సదస్సు
- సీఎం కేసీఆర్ మాటలు నీటిమూటలేనా..
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
''సభలు పెట్టి, సంబురాలు జరిపి ఇక్కడే భాషాభివృద్ధిపై కృషిని వదిలేయం..జనవరి మొదటివారంలో భాషా, సాహితీవేత్తల సదస్సు నిర్వహించి, వాటిలో వచ్చిన సూచనలతో ఖచ్చితమైన ప్రణాళిణను జనవరి మాసంలో ప్రకటిస్తాం..'' ఇదీ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు భాషాభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన. కానీ ఈ ప్రకటన ప్రకటనలకే పరిమితమైంది. జనవరి మూడోవారం పూర్తయినా ఇప్పటికీ 'తెలుగు' అభివృద్ధిపై ఎలాంటి ముందడుగూ పడలేదు. దీంతో సీఎం ఇచ్చిన అనేక హామీల్లో ఇదీ అమలుకు నోచుకోని హామీగానే మిగిలిపోతుందనే అనుమానాలు భాషావేత్తల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్మీడియేట్ వరకూ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనిలో భాగంగా సెలబస్ రూపకల్పన కోసం తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ నేతృత్వంలో కమిటీనీ నియమించింది. గతేడాది డిసెంబర్ 15 నుంచి 19 వరకూ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్లో నిర్వహించింది. మహాసభల ముగింపురోజు తెలుగు భాషాభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తారని ముందు ప్రకటించారు. కానీ ముగింపు రోజు ఎలాంటి ప్రకటనా చేయలేదు. జనవరిలో భాషా సాహితీవేత్తల సదస్సు నిర్వహించి, ఆ తర్వాత ప్రకటిస్తామని సీఎం ప్రకటించారు. భాషాభివృద్ధిపై కృషిని తెలుగు సాహిత్య అకాడమీ కొనసాగిస్తుందని చెప్పారు. అయితే సీఎం ప్రకటన ప్రకారం జనవరి మొదటివారంలో భాషా సాహితీవేత్తల సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ ప్రయత్నం అటు సాహిత్య అకాడమీ నుంచి గానీ సాంస్కృతిక శాఖ నుంచి గానీ ఇప్పటికీ జరగలేదు. నెలాఖరులో కావస్తున్నా నేటికీ సదస్సు కూడా నిర్వహించలేదు. దీంతో ఈ నెలలో భాషాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రకటన అనుమానంగా మారింది.
సూచనలు తీసుకునేదేన్నడో...
తెలుగు భాషాభివృద్ధిపై వందల, వేల సూచనలు వచ్చాయని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. అర్థాంతరంగా ప్రకటన సరికాదనీ, మరిన్ని సూచనలు అందరి నుంచి స్వీకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటించిన గడువు దాటి 15రోజులు దాటినా నేటికీ కార్యచరణ ముందుకు పడలేదు. దీంతో అసలు సూచనలు స్వీకరిస్తారా.? అనే అనుమానాలూ మొదలయ్యాయి. సాహితీవేత్తలకు సమాచారం ఇచ్చి, సమావేశం నిర్వహించాలన్నా..కనీసం వారం, పది రోజులు పట్టే అవకాశముంది. సదస్సు నిర్వహణపై డిసెంబర్ నెలాఖరులోనే మొదలు పెట్టాల్సి ఉంది..కనీసం జనవరి మొదటివారంలోనైనా ఆ పనిచేయాల్సి ఉంది. కానీ ఎవ్వరూ దీనిపై నోరుమెదకపోవడంతో సదస్సు నిర్వహణ జరగలేదని తెలుస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీమేరకు సాహితీవేత్తలతో సదస్సు నిర్వహించి, తెలుగు భాషాభివృద్ధిపై ప్రకటన చేయాలని భాషాభిమానులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై తెలంగాణ సాహితీ అకాడమీ ప్రతినిధిని అడిగితే సదస్సు నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకూ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదనీ నవతెలంగాణతో చెప్పారు.