Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టుల సాకార దిశగా కేసీఆర్ అడుగులు అద్భుతం : గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్
- మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించిన గవర్నర్
- కోటి ఎకరాలకు నీరివ్వటమే లక్ష్యం : మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ, రామడుగు/మహాదేవ్పూర్/పెద్దపల్లి ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాగు, తాగునీటి కొరత తీరుతుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులను, కన్నెపల్లి పంపుహౌజ్ పనులను గవర్నర్ సతీసమేతంగా పరిశీలించారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులను మంత్రి హరీశ్రావుతో కలిసి ఏరియల్ సర్వే చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ 8వ ప్యాకేజీ పనులు పరిశీలించిన అనంతరం విలేకర్ల సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ...కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండేండ్ల కింద పవర్పాయింట్ ప్రజెంటేషన్తో సీఎం కేసీఆర్ చెప్పిన విషయాలు ఈ రోజు పరిశీలించిన ప్రాంతాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రజల కలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పని పట్టుదలతో ఓ టీంవర్క్గా నడుస్తోందని అభినందించారు. ప్రాజెక్టు విజయవంతానికి మంత్రి హరీశ్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కె.జోషి కృషి ఎనలేనిదన్నారు. అంతకు ముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంపుహౌజ్ను సందర్శించి అక్కడి పనుల పురోగతిపై మంత్రి హరీశ్రావును గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. రూ.80వేల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి పంపుహౌజ్ పనులు జూన్కల్లా పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరందించటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని హరీశ్రావు వివరించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజ్ పనులను పరిశీలించారు. బ్యారేజ్ పనులు ఏ దశలో ఉన్నాయి? ఎంత వరకు పూర్తి చేశారు? అని ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లతోపాటు, మంత్రి హరీశ్రావును గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. కాసిపేట వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ నిర్మాణ పనులను వ్యూ పాయింట్ నుంచి చూశారు. దానికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. దానికి అనుసంధానంగా ఏర్పాటుచేస్తున్న కాల్వల పనులను, అక్కడే చేపట్టిన విద్యుత్ సబ్స్టేషన్ పనులను పర్యవేక్షించారు. అంతర్గాం మండలంలోని గోలివాడ వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులు, ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ధర్మారం మండలంలోని మేడారం వద్దకు చేరుకున్నారు. కాన్వారు ద్వారా శాయంపేట వద్ద ఆరవ ప్యాకేజ్ పనులు సొరంగంలోకి వెళ్లారు. 30 నిమిషాలపాటు సొరంగంలో పంపుహౌజ్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, సర్జికల్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో రామడుగు మండలంలోని లక్ష్మిపూర్ వద్ద నిర్మిస్తున్న ఎనిమిదో ప్యాకేజీ పనులను పరిశీలించారు. గవర్నర్ వెంట నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి శైలేందర్ జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కె జోషి, పెద్దపల్లి, కరీంనగర్ కలెక్టర్లు దేవసేన, సర్ఫరాజ్ అహ్మద్, ఐడీసీ చైర్మెన్ ఈద శంకర్రెడ్డి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, రామగుండం సీపీ దుగ్గల్, ట్రాన్స్కో ఎస్సీ సుధాకర్రెడ్డి, మంథని ఎమ్మెల్యే పుట్టమధుకర్, కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి, అండర్టన్నెల్ ప్రాజెక్టు జనరల్మేనేజర్ శ్రీనివాస్రావు, నీటిపారుదలశాఖ ఎస్సీ వెంకటేశ్వర్లు, మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి పంపుహౌజ్ గుత్తేదారులు పాల్గొన్నారు.