Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపల్ సెక్రెటరీకి మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సెప్టెంబర్ మాసంలో ప్రభుత్వానికి, కార్మిక సంఘాల నేతలకు మధ్య జరిగిన చర్చల్లో అంగీకరించిన ప్రకారం వేతన పెంపుదలకు సంబంధించిన జీవోను వెంటనే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు మంగళవారం సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవిందకుమార్కు జేఏసీ నేతలు పాలడుగు భాస్కర్, జె వెంకటేష్ (సీఐటీయూ), కె ఏసురత్నం (ఏఐటీయూసీ), మల్లేష్ (ఐఎఫ్టీయూ), ఎ శివకుమార్ (ఐఎన్టీయూసీ) వినతిపత్రం సమర్పించారు. వేతనాల పెంపుదల, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే 2017 ఆగస్టు 29,30 తేదీల్లో రెండు రోజుల సమ్మె చేస్తామని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి నోటీస్ ఇచ్చామని పేర్కొన్నారు. దానిపై అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ స్పందించి తేదీ 29.08.2017, మరియు 30.08.2017 తేదీల్లో చర్చలు జరిపారన్నారు. ఆ చర్చల్లో కొన్ని అంశాలు అంగీకరించి మినిట్స్ ఇచ్చారని తెలిపారు. తదనంతరం తేది 12.09.2017న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కూడా మళ్లీ చర్చలు జరిగాయన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో పని చేస్తున్న కార్మికులకు జీవో 14లో పేర్కొన్న వేతనాలు ఇవ్వాలని మంత్రి కోరామని, అందుకు మంత్రి కేటీఆర్ అంగీకరించడంతో జేఏసీ తలపెట్టిన సమ్మెను విరమించామని తెలిపారు. మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి ఐదు మాసాలు గడిచినప్పటికీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ రాతపూర్వకంగా ఇచ్చిన మినిట్స్ ప్రకారం జీవోగానీ, సర్క్యులర్గానీ రాలేదన్నారు. వేతనాలు పెంపుదల జీవో ఇప్పటికి విడుదల కాలేదన్నారు. దీంతో కార్మికులంతా ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు. మళ్లీ సమ్మె చేయాలని కార్మికులు ఒత్తిడి చేస్తున్నారని, అనివార్య పరిస్థితుల్లో తిరిగి పోరాటంలోకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. వేతనాల పెంపుదలపై జోక్యం చేసుకుని జీవో విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.