Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్వంగ దళితులపై పెత్తందారుల దాడి
- ఇసుక తరలింపును అడ్డుకున్నందుకే..
- నిందితులకు ఎమ్మెల్యే అండదండలు ?
- కేసు నమోదు చేయని పోలీసులు
నవతెలంగాణ-మహబూబ్నగర్ప్రతినిధి
'మాల కొడుకుల్లారా... మాముందు నిలబడే అర్హత లేనోళ్లు ఇప్పుడు మాకే నీతులు చెబుతార్రా..ఇసుక తీసుకెళ్తే అడ్డు చెబుతరా.. పంటపొలాలు మీకేనాడైనా ఉన్నయా... సర్కారిచ్చిన చవుట భూములు చూసి విర్రవీగుతున్నరా..పొలం చదును చేసుకుంటూ..ఇక్కడే దర్జాగా అన్నం తింటార్రా..' అంటూ నాగర్కర్నూల్ జిల్లాలో దళితులపై పెత్తందారులు దాడిచేశారు. గుడిసెలో కూర్చుని అన్నం తింటున్న వారిని బయటికి ఈడ్చుకెళ్లారు. అన్నంలో మన్ను పోసి కంచాన్ని కాలుతో తన్నారు. ఘటన జరిగి ఆరు రోజులైనా పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదు. పెత్తందారులకు స్థానిక ఎమ్మెల్యే అండడండలు ఉండటం వల్లే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని బాధితులు వాపోతున్నారు.
తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన దళితులు రామస్వామి, గాజుల రాంచందర్, మహిందర్, బంగారయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పొలాల మధ్య నుండి పెత్తందార్లకు చెందిన కొంతమంది ట్రాక్టర్లతో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. మట్టిబాట కావడంతో పంట దుమ్ముతో నాశనమవుతోంది. ఇసుక తీసుకెళ్లొద్దని దళితులు వారిని కోరారు. ఎంత చెప్పినా వినలేదు. ఈ క్రమంలో వారం రోజుల కిందట దళితులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అప్పటి నుంచి వారిపై అక్కసు పెంచుకున్న తాళ్లపల్లికి చెందిన రవీందర్రెడ్డి, సర్పంచ్ రాజేందర్రెడ్డి, సింగిల్విండో అధ్యక్షులు భాస్కర్రెడ్డి, నడిగడ్డ
గోవర్థన్రెడ్డి బుధవారం రాత్రి దళితులపై దాడి చేశారు. 'దళిత కొడుకుల్లారా... మీరిక్కడేంచేస్తున్నరు. రాత్రి పూట ఇక్కడేందుకు ఉంటున్నరు. మీరు ఇక్కడి నుంచి పోతరా లేదా?' అంటూ...అన్నం గిన్నెలో మన్ను పోశారు. కంచాన్ని కాలుతో తన్నారు. వీపుమీద పిడిగుద్దులు గుద్దారు. కర్రలతో దాడి చేశారు. రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్థానిక ఎమ్మెల్యే అండడండలతో కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక రవాణాకు అడ్డుచెప్పినందుకే...
కార్వంగ గ్రామం నుంచి ప్రతి రోజూ వందల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ట్రాక్టర్లు వేగంగా నడపడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, ఊర్లో నుంచి కాకుండా వేరే దారి నుంచి తరలించాలని చెప్పినందునే తమపై కక్ష పెంచుకున్నారని దళితులు చెబుతున్నారు. ఈ విషయంపై నడిగడ్డ గ్రామానికి చెందిన రైతులు గతంలో రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు.
అన్నం తింటుంటే దాడి చేశారు
గాజుల రామస్వామి
మేం అన్నం తింటుంటే వచ్చి అకారణంగా దాడి చేశారు. అన్నంలో మన్ను పోసి కొట్టారు. మా గుడిసెలు పీకేశారు. నానా బూతులు తిడుతూ ఈడ్చు కెళ్లారు. పోలీసులు కేసులు కాకుండా రాజీయత్నాలు చేస్తున్నారు.
దాడులు చేసిన వారిని ఆరెస్టు చేయాలి...
గోపాస్ లక్ష్మణ్, కేవీపీఎస్ నాయకులు, నాగర్కర్నూల్ జిల్లా.
కార్వంగ దళితులపై పెత్తందార్ల దాడులు దారుణం. వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారిని అకారణంగా కొట్టడం అన్యాయం. దళితులు కేసులు పెట్టినా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు. కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పెత్తందార్లకు కొమ్ముకాస్తున్నారు.