Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎస్ఏలో కొత్త నిబంధనలు
- సగం జిల్లాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అందని వేతనాలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు అధికారులు కొత్త నిబంధనలు పెట్టారు. ఇచ్చిన పని వందశాతం పూర్తి చేస్తేనే ఉద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారి కిషన్...డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇప్పటికీ ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలు ఉద్యోగులకు అందలేదు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీ)లకు సంబంధించి స్కూల్ విజిట్, ఆన్లైన్ విజిట్, ఆధార్ మరియు ఇతర అన్ని రకాల రిపోర్టులు, కార్యక్రమాలపై నివేదిక ఆధారంగానే వేతనాలు చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఫర్మామెన్స్ ఉంటేనే వేతనాలు ఇవ్వాలని లేకపోతే నిలిపివేయాలని సూచించారు. ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పరిస్థితీ ఇంతే. ఆధార్ అప్డేట్స్, బీసీ సబ్క్యాస్ట్ డాటా ఎంట్రీ, ఎంఎస్సీ డాటా ఎంట్రీ, టీచర్స్డాటా ఎంట్రీ తదితర అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోనూ ఎంఈఓలకు డీఈఓలు ఆదేశాలిచ్చారు.
దీంతో చాలా జిల్లాల్లో ఉద్యోగులకు ఆలస్యంగా వేతనాలు అందాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఇప్పటికీ వేతనాలు అందలేదు. పది జిల్లాల ఉద్యోగులకు శుక్ర, శనివారాల్లో వేతనాలు అందాయి. అయితే ఇచ్చేదే తక్కువ జీతం..ఇది కూడా ఏదో ఒకసాకు చెప్పి ఆపడం సరికాదని ఎస్ఎస్ఏ ఉద్యోగులు వాపోతున్నారు. ఆయా పాఠశాలలు సమాచారం ఇవ్వకుంటే, దానికి తామెందుకు బాధ్యులం అవుతామని వారు ప్రశ్నిస్తున్నారు. సమాచారమివ్వని పాఠశాలలపై, ఆ ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలనీ, అంతేగానీ తమ వేతనాలు ఆపడం సరికాదని కోరుతున్నారు. ఎంఈఓ ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు ఉద్యోగులు లేకపోవడంతో వారిపని సైతం తామే చేస్తున్నట్టు చెబుతున్నారు.
పనిచేయనోళ్లు మాకెందుకు..?: జి కిషన్, ఎస్ఎస్ఏ పీడీ
చాలా మండలాల్లో ఉద్యోగులు సక్రమంగా పనిచేయడం లేదని మా దృష్టికి వచ్చింది. ఆధార్ సీడింగ్, బీసీ ఉపకులాల గణన వివరాలు..వీటికి నెలల సమయమిచ్చినా ఆన్లైన్లో అప్డేట్ చేయడం లేదు. దీంతోనే ఫర్మామెన్స్ చూడాలని ఆదేశించార. పనివిధానం సరిగా లేని వారి వేతనాలు ఆపేయాలనీ, మరీ బాగలేకుంటే తొలగించాలని చెప్పాం.