Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక న్యాయం కోసం పోరాడుదాం
- టీమాస్తో రాజకీయ శక్తిగా ఎదగాలి: కంచ ఐలయ్య
నవతెలంగాణ-గండిపేట్
సామాజిక న్యాయం కోసం బహుజనులు ఏకమవ్వాలని టీమాస్ రాష్ట్ర చైౖర్మెన్ కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కిస్మత్పూర్లో టీమాస్ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తే కేసీఆర్ ప్రజలకు ఏమీ చేయడం లేదన్నారు. మోడీ మధ్యన ఇద్దరు చంద్రులున్నారని అన్నారు. రాష్ట్రాలను కులాల పేరుతో ముక్కలు చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ఉన్నా చట్టాలను అమలు చేయడం లేదని, కేవలం సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. అందువల్లే ప్రజా సమస్యలపై టీమాస్ ద్వారా గడపగడపనూ తట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పారు.టీమాస్ కన్వీనర్ తమినేని వీరభద్రం మట్లాడుతూ... రాజకీయాల్లో సమన్యాయం కోసం పోరాటం చేయాలన్నారు. సామాజిక వర్గాలందరికీ ఫలాలు అందాలంటే రాజకీయ వ్యవస్థను మార్చాలన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలను వదిలేసి.. కొత్తగా కేంద్రంలో థ్రర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామనడం సిగ్గు చేటన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించడమే టీమాస్ లక్ష్యమన్నారు. జీఎస్టీ పేరుతో కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థిక వ్యవస్థలో అన్ని వర్గాల వారికి సమన్యాయం కావాలన్నారు. రాష్ట్రాలకు అధికారాలు వచ్చే విధంగా కేంద్రంతో పోరాటం చేయాలని అన్నారు. విద్య, వైద్య, పరిశ్రమలు వంటి రంగాలు రాష్ట్రాల ఆధీనంలోనే ఉండాలని చెప్పారు. గిరిజనులకు, ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్లను పెంచాలన్నారు. అన్ని కులాలను కలుపుకొని బహుజన ఫ్రంట్ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
టీమాస్ కన్వీనర్లు విమలక్క, గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాం, కేసుల్లో ముందున్నార... కానీ వచ్చిన తెలంగాణ ఎవరి చేతిలో ఉందో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. మీడియా, పోలీసు వ్యవస్థను చేతుల్లోకి తీసుకుని నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. పోరాటాలను అణచివేసే ధోరణితో కేసీఆర్ సర్కార్ పని చేస్తోందన్నారు. ఉన్న కంపెనీలను మూసేయడం, కొత్త కంపెనీల పేరుతో భూ దందాలు చేయడం దారుణమన్నారు. నిరంకుశ నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది అని గుర్తుచేశారు. ఆదే స్ఫూర్తితో కేసీఆర్ సర్కార్పై పోరాటం చేయాలన్నారు.
టీమాస్ కన్వీనర్ జాన్వెస్లీ మాట్లాడుతూ.. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, గౌడ్స్, రెడ్డి వంటి అన్ని కులాల్లోనూ పేదలున్నారని తెలిపారు. దొరలు దొరలుగానే ఉన్నారని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఉద్యోగాల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీమాస్ కన్వీనర్లు శ్రీనివాస్ బహుదూర్, నాగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆశయ్య, భూపాల్, ఇఎస్ఎన్ రెడ్డి, రుద్రకుమార్, వీరేందర్గౌడ్ ముక్తాల రేఖా, రాఘవేందర్గౌడ్, జైపాల్రెడ్డి, శ్రీనివాస్, స్కైలాబ్బాబు, నర్సింగ్రావు, యాదవసంఘం నాయకులు లక్ష్మణ్, అఖిలేష్, మల్లేష్, కుర్మయ్య, రాములు పాల్గొన్నారు.