Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలిసిరాని కాలం
- వాతావరణ మార్పులతో ఆలస్యంగా పూత
- తగ్గనున్న 1.47 మెట్రిక్ టన్నుల దిగుబడి !
నవతెలంగాణ-ఖమ్మం ప్రతినిధి
రాష్ట్రంలో మామిడి రైతులు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. డిసెంబర్లో రావాల్సిన మామిడి పూత వాతావరణ మార్పులతో మార్చిలో వచ్చింది. అసలే రెండు నెలలు ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులను మూడ్రోజులుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షాలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. అందువల్ల ఈ ఏడాది 1.45లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గే వీలుందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,128 ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేస్తున్నారు.
సాధారణ పరిస్థితుల్లోనైతే 4,82,457 మెట్రిక్ టన్నుల మామిడి కాయ దిగుబడి వస్తుంది. ఈ ఏడాది పూత ఆలస్యంగా రావడం, కురుస్తున్న పొగమంచు, రెండ్రోజులుగా రాష్ట్రంలో తుపాను ప్రభావంతో చిరుజల్లులతో పూత రాలిపోయే అవకాశముందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. దీనికి తోడు బూడిద తెగులు సోకుతోంది. దాదాపు 30శాతం మేర పంట దిగుబడి తగ్గే వీలుంద ంటున్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 21మండలాల్లో 43,195ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణ పరిస్థితుల్లోనైతే 55,180 మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడులు సాధిస్తున్న జిల్లాగా రాష్ట్రంలో ముందు వరుసలో ఉంది.
తొమ్మిది జిల్లాల్లో తీవ్ర ప్రభావం...
మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఈ ఏడాది దిగుబడిపై ప్రభావం చూపనుంది. ఖమ్మం, ఆ తర్వాత జగిత్యాల, మంచిర్యాల, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి, వనపర్తి, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో అత్యధిక మామిడి సాగు ఉంది. మామిడి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి కనీసం ఇద్దరు ఉద్యాన విస్తరణాధికారులు ఉండాలి. కానీ చాలా జిల్లాల్లో రెండు, మూడు మండలాలకు ఒక విస్తరణాధికారి ఉన్నారు. వారు కూడా రైతులకు అందుబాటులో ఉండని పరిస్థితి. దీంతో మామిడి సోకుతున్న బూడిద, తేనెమంచు తదితర తెగుళ్ల నివారణకు సరైన మందులు తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారి జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొంత వరకు పూత వచ్చింది. ఏప్రిల్ నెలాఖరుకు కాయలు వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంట మొత్తం ఒకేసారి మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభావం ధరలపై పడే అవకాశం ఉంటుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణ మార్పులే కారణం
శ్రీనివాసరావు (ఏడీ హార్టికల్చర్, ఖమ్మం జిల్లా)
ప్రస్తుత సీజన్లో వాతావరణం మామిడికి సహకరించకపోవడంతోనే పూత ఆలస్యంగా వచ్చింది. పూత ఆలస్యమైనా కాయ నిలిస్తే రైతులకు మేలు. వాతావరణ మార్పు ప్రభావం దిగుబడిపై ఉంటుంది. మంచు వల్ల బూడిద తెగులు, తేనెమంచు పురుగు, బూజు తెగులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రాష్ట్రంలో అత్యధికంగా మామిడి సాగు వివరాలు
జిల్లా పేరు మండలాలు ఎకరాలు దిగుబడి (మెట్రిక్టన్నుల్లో)
ఖమ్మం 21 43,195 55,180
జగిత్యాల 18 41,148 61,450
మంచిర్యాల 18 16,010 27,258
నాగర్ కర్నూల్20 16,260 20,465
సూర్యాపేట 23 15,388 51,498
సిద్దిపేట 22 14,768 25,139
రంగారెడ్డి 27 14,880 25,331
యాదాద్రి 16 10,678 35,730
వనపర్తి 14 10,688 13,451
మహబాద్ 16 11,760 23,828
చెట్లకు పూత రావట్లేదు
మామిడి చెట్లకు పూత తక్కువగా వస్తోంది. దీంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మంచు కూడా బాగా కురవటంతో బుడిద తెగులు సోకింది. ఏ మందు పిచికారీ చేయాలో చెప్పేవారు లేరు.
పాసంగులపాటి నర్సింహారావు
(నర్సింహాపురం, చింతకాని మండలం)