Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులకు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించడంతో ఆయా స్థానాల్లో పనిచేసే డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులు 15 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీఎల్ఏ) తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జీసీఎల్ఏ అధ్యక్షుడు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, ప్రచార కార్యదర్శి జబీఉల్లా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వారు ఉద్యోగాలు కోల్పోయి ఏడాది అయిపోయిందని తెలిపారు. దీంతో ఆర్థిక నష్టపోయి, కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొన్నారు. వారిని ఇప్పుడు ఖాళీలు ఏర్పడ్డ స్థానాల్లో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాలు పెంచినా సంతోషం లేదని తెలిపారు. ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందోనన్న అభద్రతాభావంలో ఉన్నారని పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు.