Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యమైన విద్య అందించడం కోసమే గురుకులాలు
- మే నాటికి గురుకుల టీచర్ల నియామకాలు
- సీఆర్టీల వేతనం పెంచాలని సీఎం ఆదేశం
- గురుకులాలన్నీ విద్యాశాఖ పరిధిలోనే
- త్వరలో అధికారిక నిర్ణయం: మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ప్రమాణాలు ఉండడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో పేదలు, బడుగు బలహీనవర్గాల పిల్లలు చదువుతున్నారని, వారికి నాణ్యమైన విద్య అందడం లేదని చెప్పారు. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడం కోసమే కేజీ టు పీజీలో భాగమే తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలను పెద్దఎత్తున ప్రారంభించామని వివరించారు. మే నాటికి గురుకులాల్లో ప్రకటించిన 8,434 ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో గురుకుల విద్యాలయాలపై లఘు చర్చ జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, సాధారణ గురుకులాలపై కడియం శ్రీహరి ప్రకటన చేశారు. అనంతరం టీఆర్ఎస్ సభ్యులు గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, నారదాసు లక్ష్మణ రావు, మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, భానుప్రసాద్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేనన్ని గురుకులాలు తెలంగాణ ఉన్నాయని చెప్పారు. అధికార పార్టీ సభ్యులు పురాణం సతీష్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు సిద్ధాంతాల వైపు వెళ్లకుండా ఉండేందుకు కొమురంభీం జిల్లాలో సైనిక్ పాఠశాలను నెలకొల్పాలని కోరారు. టీఆర్ఎస్ సభ్యు లు పూల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్గా మార్చాలని సూచించారు. 29 మినీగురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్ల వేతనం రూ.4 వేల నుంచి పెంచాలని రాములు నాయక్ కోరారు. ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలని చెప్పారు. వీటిపై కడియం శ్రీహరి సమాధానమిస్తూ... 71 ఏండ్లలో 296 గురుకు లాలుంటే, ఈ మూడేండ్లలోనే 577 గురుకులాలు ప్రారంభించడం ఓ చరిత్ర అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 గురుకులాలు కావాలని సీఎం కేసీఆర్ను అడిగితే 577 గురుకులాలు ప్రారంభించారని చెప్పారు. 2,66,137 మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుతున్నారని అన్నారు. గురుకు లాల కోసం రూ.2,823 కోట్లు కేటాయించామన్నారు. 577లో 240 గురుకు లాలకు సొంత భవనాల కోసం భూమి కేటాయించామని చెప్పారు. సాంకేతిక కారణాలతో పాత టెండర్లు రద్దు చేశామని, కొత్త టెండర్లు త్వరలోనే పిలుస్తా మన్నారు. ఏడాదిలోనే భవనాలు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో నాలుగు క్రికెట్ అకాడమిలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. మినీ గురుకులాల్లో పనిచ ేస్తున్న సీఆర్టీల జీతాలు పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. విదేశాల్లో విద్యా విధానం అధ్యయనం కోసం ఓ టీంను పంపిస్తామని అన్నారు. రాష్ట్రంలో రెండు సైనిక్ పాఠశాలలు మంజూరయ్యాయని, అవి ఉమ్మడి కరీంనగర్లో, ఉమ్మడి వరంగల్లో నెలకొల్పుతామని వివరించారు. వాటి ప్రతిభను చూసి తర్వాత కొమురంభీం జిల్లాలో ఏర్పాటుపై ఆలోచిస్తామన్నారు. తెలంగాణ స్టడీసర్కిల్స్ను బలోపేతం చేస్తామని చెప్పారు. సామాజిక తరగతుల వారీగా ఉండాలా? అందరికీ కలిపి ఒకటే ఉంటే బాగుంటుందా?అన్నది సమాలోచన చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఐదు శాఖల పరిధిలో గురుకులాలున్నాయని చెప్పారు. వాటన్నింటినీ విద్యాశాఖ పర్యవేక్షణ చేస్తుందన్నారు. గురుకులాలను ఒకే గొడుగు కిందికి తెచ్చే అంశంపై త్వరలోనే ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అన్ని గురుకులాల్లో కామన్ మెనూ అమలవుతోందని, పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఓ విద్యార్థిపై రూ.50 వేలు, రూ.60 వేలు ఖర్చు పెట్టేవారిని, ప్రస్తుతం ఒక్కొక్కరిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని వివరించారు. అమ్మాయిలకు శానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నామని అన్నారు. అనంతరం మండలి శనివారానికి వాయిదా పడింది.