Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ పట్టాలతో 20 ఎకరాలు కాజేసిన అక్రమార్కులు
- భూమి విలువ సుమారు రూ.2.50కోట్లు
- తహసీల్దార్ను నిర్బంధించిన గ్రామస్తులు
- గ్రామస్తులపైనే కేసు పెట్టిన తహసీల్దార్
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఘటన
నవతెలంగాణ-రాయపోల్
నిజాంకు చెందిన 20 ఎకరాల భూములకు అక్రమ వారసులను సృష్టించారు కబ్జాదారులు. అధికారుల అండదండలతో నకిలీ పట్టాలూ సృష్టించి అమ్మేసుకున్నారు. ప్రభుత్వ భూప్రక్షాళనలో భాగంగా చేపట్టిన అధికారుల సర్వేలో ఈ విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తహసీల్దార్ను, రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించారు. అయితే, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమను నిర్బంధించారని గ్రామస్తులపైనే కేసు పెట్టడం గమనార్హం. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం జరిగింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం..
రాయపోల్ మండల కేంద్రంలోని సర్వే నెం.720, 1391లో 20 ఎకరాల భూమి ఉంది. నిజాం కాలం నుంచి మామిడి తోట జాగిర్దార్ భూమిగా వస్తోంది. నిజాం అనంతరం తోటకు వారసులు లేకుండా పోయారు. అప్పటి నుంచి ఇది సర్కార్ తోటగా పిలవబడుతున్నది. గ్రామ సమైక్య ఆధ్వర్యంలో గ్రామస్తులే తోటలో మామిడి చెట్లను పెంచుతున్నారు. వారసులు లేని తోటపై కొంతమంది అక్రమార్కుల కన్నుపడింది. అధికారుల అండతో దాన్ని కాజేసేందుకు ప్రణాళిక రచించారు. వారసులు ఉన్నట్టు సృష్టించి వారిచేత వేరొకరికి విక్రయిస్తున్నట్టు నకిలీ పట్టాలూ తెచ్చారు. భూమి మూడో వ్యక్తి పేరు మీదకు 2005లో మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాగితాలపై మూడో వ్యక్తి పేరున్నా ఆ విషయం తెలియని గ్రామస్తులు మామిడి తోట సాగు చేస్తున్నారు. రెండు, మూడేండ్ల నుంచి ఆ భూమిలో కందులు, ఇతర పంటలు పండించుకుంటున్నారు. ప్రస్తుతం భూ ప్రక్షాళనలో జరుగుతున్న ఆన్లైన్ ప్రక్రియ కోసం అక్రమార్కులు సర్వేయర్ను భూమి వద్దకు పంపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సర్వేయర్ను అడ్డుకున్నారు. ఈ అక్రమంలో తహసీల్దార్ కిషన్సింగ్కు వాటా ఉందని ఆరోపిస్తూ గ్రామస్తులందరూ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ను, రెవెన్యూ సిబ్బందిని కార్యాలయంలోనే ఉంచి నిర్బంధించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో తహసీల్దార్ దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా చేపట్టారు. సర్కార్ భూమిని నకిలీ పత్రాలతో కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్యాలయం తాళం పగలకొట్టి అధికారులను విడిపించారు. చట్టం ప్రకారం ముందుకు పోవాలని గ్రామస్తులకు సూచించారు. తనను నిర్బంధించారని గ్రామస్తులపై తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.