Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలతో ప్రజలకు శ్వాస, దీర్ఘకాల వ్యాధులు
- కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్న పీసీబీ
నవతెలంగాణ - సంగారెడ్డి ప్రతినిధి
అభివృద్ధి పేరుతో కంపెనీలు, పరిశ్రమలను స్థాపించిన తర్వాత ప్రజల్ని పట్టించుకునేవారు కరువయ్యారు. సంగారెడ్డి జిల్లాలో ఏండ్ల నుంచి కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా కెమికల్ ఫ్యాక్టరీల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. ఇక ఆగ్రామాల్లో చుట్టాలుగానీ, కొత్తగా వెళ్లినవారుగానీ ఒక్కరోజు కూడా ఉండలేని దుస్థితి. దీంతో తమ బతుకులింతేనా? అని స్థానికులు వాపోతున్నారు.సంగారెడ్డి జిల్లాలో సుమారు వెయ్యికిపైగా కంపెనీలున్నాయి. హత్నూర మండలంలో అరబిందో, ఆర్చ్ ఫార్మా, ఈమెనార్ సహా మొత్తం పది వరకు కెమికల్ ఫ్యాక్టరీలున్నాయి. గుమ్మడిదలలో 50 నుంచి 60, ఐడీఏ బొల్లారం 250, గడ్డ పోతారం, ఖాజిపల్లిలో 40 వరకు కంపెనీలున్నాయి. జిన్నారం మండలంలోని గడ్డపోతారంలో 1985 కాలంలో పది కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పదేండ్లలోనే మరో 30 కంపెనీలు వెలిశాయి. ఇందులో అరబిందో, ఎస్ఎంఎస్, హెటిరో, మైత్రి, లీ ఫార్మా, శ్రీరాం ఫార్మా, ఆర్డీపీఎల్ ప్రముఖ కంపెనీలున్నాయి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలే అయినా కాలుష్య వ్యర్థాల విడుదల, నిర్వాహణ కోసం తగిన జాగ్రతలు తీసు కోవడం లేదు. దీంతో అక్కడ వాయు, గాలి,నీరు కాలుష్యమవుతున్నాయి.
కంపెనీలు వెదజల్లే రసాయన వాయువులు, వ్యర్థాలతో గాలి, చెరువులు, కుంటలు పూర్తిగా కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులివ్వొద్దని కోర్టు ఆదేశాలున్నప్పటికీ కంపెనీలను నెలకొల్పుతూనే ఉన్నారు. ఉన్న కంపెనీలు వెదజల్లే కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చిన సందర్భంలో మాత్రమే కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయనే విమర్శలున్నాయి. గడ్డపోతారంలోని పేరుగాంచిన ఎనిమిది కంపెనీలే అధికంగా కలుషిత వ్యర్థాలను విడుదల చేస్తుండటం గమనార్హం. రసాయన, ఔషధ కంపెనీలైన వీటి నుంచి పెద్దఎత్తున సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మోనో ఫ్లోరో కార్బన్లు విడుదలవుతున్నాయి. ఫలితంగా గడ్డపోతారం, చెట్లపోతారం, కిష్టాయపల్లి గ్రామాల్లోని ప్రజలు, చిన్నారులు రోగాలపాలవుతున్నారు. ఈ గ్రామాల్లోని 50 మంది వరకు రెగ్యులర్గా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నెలనెలా రూ.5వేల నుంచి 10వేలవరకు ఖర్చుపెట్టుకుంటున్నారు. కాలుష్య ప్రభావం వల్లే వారు ఈ స్థితికి చేరినట్టు చెబుతున్నారు. 'నేను దగ్గు, ఆస్తమా తో బాధపడుతున్నా. గోలీలకు నెలకు రూ. నాలుగైదు వేల ఖర్చవుతున్నది. మీ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం వల్లే నీకు ఇలాగైందని డాక్టర్లు చెప్పారు' అని గడ్డపోతారం గ్రామానికి చెందిన యాదయ్య వాపోయాడు.
రాత్రిపూటనే అధికంగా వదులుతున్నరు : ఎం. నర్సింహారావు, కిష్టాయపల్లి
రాత్రిపూటనే కంపెనీల నుంచి విషవాయువులను అధికంగా వదులుతున్నారు. నిద్రలో శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నం. నీళ్లు, గాలి కాలుష్యమైపోయాయి. పంటలు పండుతలేవు. ఎన్ని వందల ఫీట్ల బోర్లు వేసినా కెమికల్ నీళ్లే వస్తున్నయి. అవసరాలకు అవే నీళ్లను వాడుతున్నాం. తాగేటందుకు మాత్రం ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నం.
కొత్తోల్లు ఒక్కరోజుగిట్ల ఉండలేరు : లింగంగౌడ్(60), గడ్డపోతారం
మా ఊరికి కంపెనీలు రాక ముందు మల్లెం, అయ్యమ్మ చెరువుల నీళ్లనే తాగేటోళ్లం. అవసరాలకు వాడుకునేటోళ్లం. ఇప్పుడు ఆ నీళ్లన్నీ కలుషితమైనయి. మా బిడ్డ పిల్లలు హైదరాబాద్ నుంచి సెలవుల కోసం వస్తే ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. చర్మంపై దద్దుర్లు వచ్చి జ్వరం వస్తోంది. మాకిది అలవాటైంది. ఊరికి కొత్తగొచ్చినోళ్లు ఒక్కరోజు కూడా ఉండలేరు.
శ్వాస, చర్మ సంబంధ వ్యాధులే ఎక్కువ : పద్మారావు, ఆర్ఎంపీ, గడ్డపోతారం
30 ఏండ్ల సంది నేనిక్కడే ప్రాక్టీస్ చేస్తున్న. కిష్టాయిపల్లి, గడ్డపోతారం గ్రామాల నుంచి అధికంగా శ్వాస సంబంధ సమస్యలతో వైద్యం కోసం వస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ ఈ ప్రభావం ఎక్కువ. రసాయనాల గాఢత ఎక్కువగా వచ్చినపుడు తట్టుకోక స్పృహ కోల్పోతుంటారు. ప్రథమ చికిత్స చేసి పెద్దాస్పత్రికి పంపుతా.
చర్యలు తీసుకుంటున్నాం : భద్రగిరీశ్, ఆర్వో, పీసీబీ
అధికంగా కాలుష్యాన్ని వెదజ ల్లుతున్న పరిశ్రమలను గుర్తించాం. ఇప్పటికే 15 కంపెనీల యాజ మాన్యాలకు నోటీసులిచ్చాం. సమీప గ్రామాల్లో నీరు, గాలిపై వాటి ప్రభా వం పడకుండా చర్యలు తీసు కుంటు న్నాం. వ్యర్థాలు ఎక్కడ పార వేయాలి? ఎలా నాశనం చేయాలి? తదితర నిబంధనలను కంపెనీలన్నీ కచ్చి తంగా పాటించేలా చూస్తున్నాం. ఫ్యాక్టరీలలో ఎప్ప టికప్పుడు తనిఖీ చేస్తున్నాం. మాట వినకుంటే కరెంటు, నీరు కట్చేస్తామని పరిశ్రమలను ఇప్పటికే హె చ్చరించాం.