Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.600 కోట్లు ముంచిన ఇంకో కంపెనీ
- కంపెనీ దివాలా తీసినప్పటికీ రూ.523 కోట్ల రుణం మంజూరు
- స్కాంలో బ్యాంకు సీనియర్ మేనేజర్లు, ప్రయివేటు కంపెనీల చైర్మెన్లు, డైరెక్టర్లు
- కేసు నమోదు చేసి సీబీఐ రంగంలోకి..
- హైదరాబాద్ సహా కంపెనీకి చెందిన 50 ప్రదేశాల్లో దాడులు
- విలువైన పత్రాలు స్వాధీనం ొ38 మంది నిందితులుగా గుర్తింపు
నవతెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
బ్యాంకు మోసాల వరుసలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.600 కోట్ల రుణాన్ని మోసపూరితంగా పొందిన విదేశీ కంపెనీ బీవీఐ ఉదంతం బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ సదరు కంపెనీకి చెందిన చైర్మెన్లు, డైరెక్టర్లు, మరికొందరు ప్రయివేటు వ్యక్తులతో పాటు ఐడీబీఐ బ్యాంకు సీనియర్ మేనేజర్లపై కేసు నమోదు చేయడమే గాక దేశ వ్యాప్తంగా హైదరాబాద్ సహా వారికి చెందిన 50 ప్రదేశాలలో గురువారం దాడులు నిర్వహించింది. సీబీఐ అధికారవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఫిన్లాండ్ స్థావరంగా నడుస్తున్న బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ కంపెనీ 2010లో చెన్నై ఐసీజీ ఐడీబీఐ బ్యాంక్ నుంచి 322.40 కోట్ల రూపాయల(52 మిలియన్ యూరో డాలర్లు) రుణాన్ని పొందింది. ఈ రుణ మంజూరులో అప్పటి సీనియర్ బ్యాంక్ మేనేజర్లు, బీవీఐ కంపెనీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న మరికొన్ని కంపెనీల చైర్మెన్లు, డైరెక్టర్లు చక్రం తిప్పారు. అనంతరం 2013 అక్టోబర్లో బీవీఐ కంపెనీ దివాళా తీసినట్టు ఫిన్లాండ్కు చెందిన ఒక కోర్టు ప్రకటించింది. అయినా ఆ కంపెనీకి 2014 ఫిబ్రవరి, మార్చి నెలలో మరో 523 కోట్ల రూపాయలను(83 మిలియన్ డాలర్లు) ఐడీబీఐ.. చెన్నై బ్రాంచ్ నుంచి రుణం మంజూరు చేశారు. దీనిపై తాజాగా మేల్కొన్న బ్యాంకు ఉన్నతాధికారులు.. బీవీఐ, దాని అనుబంధ కంపెనీలు, తమ బ్యాంకు సీనియర్ మేనేజర్లు, ఇతర ప్రయివేటు వ్యక్తులతో కలిసి చేసిన ఈ స్కాం గురించి సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ రుణాల మంజూరులో బ్యాంకుకు సంబంధించిన నిబంధనలు, విదేశీ నిబంధనలు, ఆర్బీఐ నిబంధనలన్నింటిని కూడా తుంగలో తొక్కి అడ్డగోలుగా రుణాలను మంజూరు చేశారని, దాని వలన ఐడీబీఐ బ్యాంకుకు రూ. 600 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని అధికారులు సీబీఐకి ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు బీవీఐతో పాటు దానికి అనుబంధంగా ఉన్న కంపెనీలు వాటి చైర్మెన్లు, డైరెక్టర్లు, ఐడీబీఐ చెన్నై బ్రాంచ్కు చెందిన అప్పటి సీనియర్ మేనేజర్లు, ఇతర ప్రయి వేటు వ్యక్తులు కలిపి మొత్తం 38 మందిపై కేసులను నమోదు చేశారు. వారిపై సెక్షన్ 409తో పాటు 120, 120బీ, అవినీతి నిరోధక చట్టం, తదితర సెక్షన్ల క్రింద కేసులను నమోదు చేశారు. అంతేగాక సదరు విదేశీ కంపెనీ, దాని అనుబంధ కంపెనీలకు చెందిన 38 మంది నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని దేశవ్యాప్తంగా 50 ప్రాంతాలపై మెరుపు దాడులను నిర్వహించారు. హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, బెల్గాం, జైపూర్, పూణె, ఫరీదాబాద్, గాంధీనగర్ మొదలైన ప్రాంతాలలో ఈ దాడులను నిర్వహించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.