Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్జీల నియామకంపై అనారోగ్యకర వాతావరణం...
- న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలి: సుందరయ్య స్మారకోపన్యాసంలో జస్టిస్ బిపి జీవన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాల రక్షణకు కావలి కాయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిపి జీవన్రెడ్డి ఆకాంక్షించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ జడ్జీల నియామకమంపై ఎడతెగని చర్చ నడుస్తున్నదని ఆయన చెప్పారు. ఈ క్రమంలో నియామకాలపై ఒక అనారోగ్యకర వాతావరణం కొనసాగుతున్నదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 1993లో న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనే అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. ఇదే సమయంలో న్యాయ వ్యవస్థకు, రాజకీయాంశాలకు ఉండాల్సిన సమన్వయం తదితరాంశాలు ప్రస్తావనకు వచ్చాయని వివరించారు.
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 33వ వర్థంతిని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్లోని ఎస్వీకె (బాగ్లింగంపల్లి)లో సభ నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బి.వి.రాఘవులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జీవన్రెడ్డి.. 'చట్టం- న్యాయస్థానాలు-సమాజం' అనే అంశంపై స్మారకోపన్యాసమిచ్చారు. ఎస్వీకె మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్ విజ్ఞాన కేంద్రం కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. జీవన్రెడ్డి మాట్లాడుతూ.. సుందరయ్య తన నిరాడంబరత, జీవనశైలి ద్వారా నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆనాడు ఆయన పార్లమెంటుకు సైకిల్పై వెళ్లటం ద్వారా ఒక నిజమైన ప్రజా ప్రతినిధి ఎలా ఉండాలనే విషయాన్ని ఆచరణలో చూపించారని తెలిపారు. కానీ నేటి రాజకీయ నాయకులు అందుకు భిన్నంగా నైతిక విలువలకు తిలోదకాలొదిలి.. సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నారని విమర్శించారు. కర్నాటకలో ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది కోటీశ్వరులున్నారని తెలిపారు. దీన్నిబట్టి మన ఎన్నికలు, రాజకీయ వ్యవస్థ ఎంత ఖరీదైన విషయాలుగా మారిపోయాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
జడ్జీల నియామకానికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ మధ్య ఒక విచిత్రకరమైన వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన నియామకాలను రాష్ట్రాలు నిర్ణయించజాలవని చెప్పారు. ఇదే విధంగా హైకోర్టు నియామకాలపై కేంద్ర నిర్ణయాధికారం ఉండబోదని అన్నారు. ఇలాంటి నియమ నిబంధనల నేపథ్యంలో అనేక సమస్యలు, ఇబ్బందులు తలెత్తాయని వివరించారు. దీంతో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలనే అంశం కూడా తెరపైకి వచ్చిందన్నారు. పౌరులకు జీవించే హక్కు, సమానత్వపు హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ తదితరాంశాలపై కూడా పెద్ద చర్చ జరిగిందన్నారు. ఇదే సమయంలో పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా న్యాయమూర్తుల ఎన్నికకు ఓటింగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందంటూ అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు. అదే పాశ్చాత్య దేశాల్లో ఈ ప్రయోగం విఫలమైనందున దాని జోలికి మనవాళ్లు పోలేదని చెప్పారు. 1975లో ఇందిరాగాంధీకి క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయని.. అందువల్ల ఆమె న్యాయ వ్యవస్థను నియంత్రించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆ తర్వాత కాలంలో జడ్జీల నియామకాలను ఎవరు చేపట్టాలనే దానిపై 'నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్'ను ఏర్పాటు చేశారని వివరించారు. అందువల్ల నియామకాలపై ఇటు శాసన వ్యవస్థ, అటు న్యాయ వ్యవస్థ.. ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాఘవులు మాట్లాడుతూ.. సుందరయ్య పేదలు, సామాన్యుల నిత్య దైనిందిన సమస్యలను అర్థం చేసుకుని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేశారని అన్నారు. ఈ క్రమంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి.. మిల్లు పట్టించి, ఆ తర్వాత ఆ బియ్యాన్ని కిలో రూపాయికే పేదలకు పంపిణీ చేశారని తెలిపారు. అలాంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలపై చెరగని ముద్ర వేశారని చెప్పారు. అంతకు ముందు సుందరయ్య చిత్రపటానికి వారు పూలమాలలేసి ఘన నివాళులర్పించారు.