Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాలరీస్ పీఆర్వో బి.మహేశ్
హైదరాబాద్: విద్యార్థులు చదువుతోపాటు కళారంగంలోనూ రాణించాలని సింగరేణి కాలరీస్ పీఆర్వో బుడగం మహేశ్ అన్నారు. ఆసిఫ్నగర్లోని దత్తాత్రేయ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన సమ్మర్ ఆర్ట్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు వేసవి సెలవులు వృధా చేసుకోకుండా డ్రాయింగ్, పెయింటింగ్లాంటి అంశాల్లో శిక్షణ తీసుకోవడం చాలా మంచి విషయమన్నారు. అనంతరం ఈ కార్యాక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన దత్తాత్రేయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహారావ్ మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సమాజహిత కార్యక్రమాలు చేపట్టామని, కళ్యాణ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మొదటిసారిగా డ్రాయింగ్,పెయింటింగ్ శిక్షణా తరగతులు నిర్వహించామని అన్నారు. నెల రోజులపాటు శిక్షణా తరగతులను విజయవంతంగా నడిపించిన కళ్యాణ్ ఆర్ట్స్ వారిని అభినందించారు. ప్రస్తుత కాలంలో ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్కు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని మరో గౌరవ అతిథి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏజీఎం కెఎన్ రాజన్ అన్నారు. సినిమాల్లో యూనిమేషన్కు మంచి డిమాండ్ ఉందని, దానికి మొదటిమెట్టు డ్రాయింగ్, పెయింటింగ్లో మెళకువలు తెలుసుకోవడమే చెప్పారు. తర్వాత డ్రాయింగ్ సమ్మర్ క్యాంపు నిర్వహించిన ఆర్ట్ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ క్యాంపులో పెన్సిల్ షేడింగ్, స్టిల్ లైఫ్ పెయింటింగ్, లెటరింగ్, మాస్క్ మేకింగ్, వాటర్ కలర్, పోస్టర్ కలర్ వంటి వివిధ అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. కాగా జూన్ మొదటివారం నుంచి వారాంతపు తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ తరగతుల్లో ప్రభుత్వం నిర్వహించే లోయర్ డ్రాయింగ్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించనున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఆవిష్కరించి విద్యార్థులు వేసిన డ్రాయింగ్, పెయింటింగ్లు, ఇతర కళాకృతులను ఆయన పరిశీలించారు.