Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
- హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఈశ్వరయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీలకు రాజ్యాధికారంతోనే వెనుకబడిన తరగతుల(బీసీ) సమస్యలు పరిష్కారమవుతాయని హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి వి ఈశ్వరయ్య తెలిపారు. కులాలు, వృత్తులు వేరైనా బీసీ జాతి ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో 'రాజ్యాంగం- బీసీలు- రిజర్వేషన్లు-పౌరుల పాత్ర' అనే అంశంపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన జస్టీస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ...విద్యార్థి దశ నుంచే సమాజంపై అందరూ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. న్యాయవాదిగా ఉన్నప్పుడు తనకూ సామాజిక స్పృహ ఉండేదికాదని చెప్పారు. ఎన్టీఆర్ కాలంలోనే బీసీలు రాజకీయంగా కొంత ఎదిగారని తెలిపారు.
అందరికీ సమాన హక్కులు ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పినా, పాలకుల నిర్లక్ష్యంతో అది అమలు కావడం లేదని అన్నారు. సామాజిక, రాజకీయ న్యాయం జరిగితేనే బీసీల బతుకుల్లో మార్పు వస్తుందని చెప్పారు. విద్యా వ్యాపారమయం, వైద్యం ప్రయివేటు పరం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూడా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలోనే నడుస్తుందన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, ప్రయివేటు రంగంలోనూ వీటిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు. సామాజిక ఉద్యమ నాయకులు జే.బీ.రాజు మాట్లాడుతూ... దేశంలో గొప్ప రాజ్యాంగం ఉన్నా, దాన్ని అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. 3 శాతం జనాభా ఉన్న కులాలే నేడు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నాయని చెప్పారు. సమస్యల పరిష్కారానికి మార్క్స్, అంబేద్కర్ విధానాలనే పరిష్కార మార్గాలని ఆయన సూచించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు టి దేవేందర్గౌడ్, సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్, ప్రొఫెసర్ ఐ తిరుమలి, బీసీ సాధికారిత సంస్థ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్ తదితరులు మాట్లాడారు.