Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నరు : టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ
నవతెలంగాణ-రామచంద్రాపురం
టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో అభివృద్ధి లేదని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. సమావేశానికి పటాన్చెరు నియోకవర్గ ఇన్చార్జి, జడ్పీటీసీ గడీల శ్రీకాంత్గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సామాన్య కుటుంబాల్లోని ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. తమ పార్టీ దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతోందన్నారు. టీఆర్ఎస్ నాయకులు తమది ఉద్యమ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని గొప్పలు చెప్పుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. మిషన్ భగీరథ, కాకతీయ స్కీమ్లలో అడుగడుగునా అవినీతి జరుగుతోందన్నారు. ఎండాకాలంలో చాలా గ్రామాల్లో నీటిఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనంటే కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు అనే విధంగా అధికారం చెలాయిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పాలన అందిస్తుందని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.