Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూకు రూ.100 కోట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రానికి రూ.242 కోట్లు రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, రూసా ఎస్పీడీ నవీన్ మిట్టల్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూసా 1.0 నిధుల వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని తెలిపారు. దీంతో రూసా 2.0 నిధుల కింద తెలంగాణకు రూ.242 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఉన్నత విద్యాభివృద్ధికి ఏర్పాటైన రూసా 12వ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిందని తెలిపారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నాణ్యత, శ్రేష్టత విభాగంలో రూ.100 కోట్లు, ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ విభాగంలో రూ.7 కోట్లు, కాకతీయ విశ్వవిద్యాలయానికి పరిశోధన, ఆవిష్కరణ, నాణ్యతా ప్రమాణాల పెంపు కింద రూ.50 కోట్లు, మౌలిక వసతుల కల్పన విభాగంలో తెలంగాణ విశ్వవి ఓద్యాలయానికి రూ.20 కోట్లు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవి ద్యాలయానికి రూ.20 కోట్లు, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొత్త మోడల్ డిగ్రీ కళాశాలల కోసం ఒక్కో దానికి రూ.12 కోట్ల చొప్పున మొత్తం రూ.24 కోట్లు రూసా నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. జయ శంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోల సత్తుపల్లి, ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మోడల్ డిగ్రీ కళాశాలలుగా నవీకరణకు ఒక్కో దానికి రూ.4 కోట్ల చొప్పున రూ.8 కోట్లు, మౌలిక వసతుల కల్పన విభాగంలో ఐదు కళాశాలలకు ఒక్కో దానికి రూ.2 కోట్ల చొప్పున రూ.10 కోట్లు, సంస్థాగత పునర్నిర్మాణం, సామ ర్థ్యాల పెంపు, సంస్కరణల కింద రాష్ట్రానికి రూ.3 కోట్ల చొప్పున అన్ని విభాగాల్లో కలిపి మొత్తం తెలంగాణకు 242 కోట్లు రూసా నిధులు కేటాయించబడ్డాయని తెలిపారు.
ఓయూ అభివృద్ధికి ఉపయోగపడతాయి : వీసీ రామచంద్రం
రూసా నిధులు రూ.100 కోట్లు రావడం పట్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) వీసీ ఎస్ రామచంద్రం హర్షం వ్యక్తం చేశారు. రూసా ఓయూకు ఆర్థిక బొనాంజ ప్రకటించిందని తెలిపారు. ఓయూలో నాణ్యమైన విద్య అందించేందుకు విద్యాప్రమాణాలు పెంచేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ నిధులు ఓయూ అభివృద్ధికి ఉపయోగపదతాయని తెలిపారు. ఇందులో రూ.20 కోట్లు హాస్టళ్లు నిర్మాణం, మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. రూ.70 కోట్లు విశ్వవిద్యాలయం భవనాలు, నీటి సరఫరా, సోలార్ విద్యుత్ సౌకర్యం, హాస్టళ్లు, తరగతి గదులు వంటి పనుల ఆధునీకరణ కోసం వినియోగిస్తామని తెలిపారు. మిగిలిన రూ10 కోట్లు అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా జిమ్నాజియం ఏర్పాటు చేస్తామని, కొత్త పరికరాలు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.