Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళేశ్వరం పనులను పరిశీలించిన మంత్రి హరీశ్
నవతెలంగాణ-మహాదేవపూర్
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, అన్నారం కెనాల్, కన్నెపల్లి పంపుహౌజ్ పనులను జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పనులను హరీశ్రావు శుక్రవారం పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీకి 85 గేట్లు, అన్నారం బ్యారేజీకి 66 గేట్లు, సుందిళ్ల బ్యారేజీకి 74 గేట్లను జూన్ నెలాఖరు వరకు బిగించాలని ఆదేశించారు. అన్నారం బ్యారేజీకి 66 గేట్లకుగాను 51 గేట్లు తయారయ్యాయని, మరో 15 గేట్లు జూన్ 15నాటికి పూర్తి చేస్తామని ఇంజినీర్లు తెలిపారు. గేట్ల తయారీలో నిపుణులైన కన్నయ్యనాయుడు పనులను పరిశీలిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు కన్నా ఇక్కడి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని ప్రశంసించారని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని 15 జిల్లాలకు మేలు జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్కు తాగునీరు, మిగతా జిల్లాలకు తాగు, సాగునీటిని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్టా పనులు జూన్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. మంత్రి వెంట డీఈ నల్లా వెంకటేశ్వర్లు, అన్నారం బ్యారేజీ ప్రతినిధులు మల్లికార్జున్రావు, భార్గవ్, కెనాల్ ప్రతినిధి పూర్ణచందర్రావు, కన్నెపల్లి పంపుహౌజ్ జీఎం సతీష్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ వినోద్కుమార్, మేడిగడ్డ ప్రాజెక్టు ప్రతినిధి రామకృష్ణరాజు, కాటారం డీఎస్పీ కెఆర్కె.ప్రసాద్రావు ఉన్నారు.