Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతీ, యువకుడి ఆత్మహత్య
- న్యాయం చేయాలని బాధిత కుటుంబీకుల ఆందోళన
నవతెలంగాణ - వలిగొండ
'కులాంతర పెండ్లి చేసుకున్న ప్రేమజంటకు సహకరిస్తారా? మీ అంతుచూస్తా' అంటూ పెళ్లి కూతురు తండ్రి బెదిరించటంతో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్డిరేపాకలో గురువారం జరిగింది. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు బెదిరించిన వ్యక్తి ఇంటి ఎదుట ఆందోళనదిగారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం.. రెడ్డరేపాక గ్రామానికి చెందిన గుర్రం పాపిరెడ్డి-కమలమ్మ దంపతుల కూతురు గుర్రం స్వాతి హైదరాబాద్లో బ్యూటీషియన్ కోర్సు చేస్తున్నది. అదే గ్రామంలోని యాదవ సామాజిక తరగతికి చెందిన కడారి బాలమల్లు-మల్లమ్మ కుమారుడు వెంకటేశ్ హైదరాబాద్లోనే ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. గత సోమవారం వరంగల్లోని ఆర్యసమాజ్లో పెండ్లి చేసుకున్నారు. వెంకటేష్, స్వాతి పెండ్లికి చిన్ననాటి స్నేహితులు, క్లాస్మేట్స్ అయిన సిరికొండ వెంకటేశం(23), దంతూరి సిరి (23) సహకరించారనే అనుమానం పాపిరెడ్డిలో బలంగా ఉంది. దీంతో వారిద్దరి కుటుంబ సభ్యులనూ అతను బెదిరించాడు. హైదరాబాద్లోని సిరికొండ వెంకటేష్ రూమ్ వద్దకెళ్లి తన కూతురు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించాడు. వెంకటేష్ నడిపే కారులో పరిశీలించగా...తన కూతురు బట్టలు కనిపించాయి. 'మా కూతురు ఎక్కడుందో చెప్పాలి. లేకుంటే నీ అంతూ, సిరి అంతూ చూస్తా' అంటూ బెదిరించి వెళ్లాడు. దీంతో సిరికొండ వెంకటేశ్ హైదరాబాద్లోని తనరూమ్లో ఉరేసుకున్నాడు. గుంటూరు జిల్లా రేపల్లెలో బ్యూటీషియన్ కోర్సు చేస్తున్న సిరి విషయం తెలుసుకుని తానూ ఉరేసుకుంది. వారిద్దరూ చనిపోయిన సమాచారం తెలుసుకున్న పాపిరెడ్డి కుటుంబ సభ్యులు గ్రామం నుంచి పరారయ్యారు. గురువారం ఉదయం నుంచి బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఇరువురి కుటుంబాలకి న్యాయం చేయాలని, పాపిరెడ్డిని శిక్షించాలని ఆయన ఇంటిముందు పెద్దఎత్తున ధర్నా చేశారు. రజక సంఘం రాష్ట్ర నాయకులు కొత్తకొండ లక్ష్మి, గౌడసంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి వెంకటేశ్, సిరి మృతదేహాలు చేరాయి. గతంలో ఇదే జిల్లాలో జరిగిన స్వాతి-నరేష్ ఉదంతంలా జరగకుండా వలిగొండ, రామన్నపేట, ఆత్మకూరు ఎస్ఐలు ఇద్రీస్అలీ, నాగన్న, యాదగిరి ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు రెడ్డిరేపాకలో బందోబస్తు నిర్వహిస్తున్నాయి. గుర్రం స్వాతి, కడారి వెంకటేశ్ పోలీసుల సంరక్షణలో ఉన్నారు.