Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లానింగ్ డిపార్ట్మెంటుకు పూర్తిస్థాయి కార్యదర్శి లేని వైనం
- నామ్కే వాస్తేగా తయారైన విభాగం
- సీఎస్ కార్యాలయం నుంచే కీలక నిర్ణయాలు
- తాజాగా నిటి ఆయోగ్ నివేదికా అక్కణ్నుంచే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రణాళికాశాఖ... ఇతర అన్ని శాఖలకు దిశా, నిర్దేశం చేసే అతి కీలకమైన డిపార్టుమెంటు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక రంగాల్లో వస్తున్న మార్పులు, వాటి పర్యవసానాలపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు నిర్వహించటం ద్వారా ప్రభుత్వానికి కచ్చితత్వంతో కూడిన తాజా సమాచారాన్ని అందజేస్తుంటుంది. వ్యవసాయోత్పత్తులు, వాతావరణ పరిస్థితులు మొదలుకుని మాతా శిశు సంరక్షణ, పౌష్టికాహార లోపాల వరకు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి.. తగిన నివేదికలు రూపొందిస్తుంటుంది. తద్వారా రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందా? లేదా? అనే అంశాన్ని నిర్దారిస్తుంది. ఇంతటి కీలకమైన ఈ శాఖకు ఇప్పుడు పూర్తిస్థాయిలో ముఖ్య కార్యదర్శి లేకపోవటం గమనార్హం. గతంలో ఈ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ బీపీ ఆచార్యను ప్రభుత్వం ఐదు నెలల క్రితం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ)కి డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ శాఖకు పూర్తి స్థాయి ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం నియమించలేదు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఈ శాఖకు సంబంధించిన అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే ఆయన ఆర్థికశాఖకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణాళికశాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉండే ఉన్నతాధికారి.. ఆ శాఖతోపాటు ఖైరతాబాద్లోని అర్థగణాంకశాఖను, గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)ని కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి ముఖ్య కార్యదర్శి లేనందువల్ల వాటి కార్యకలాపాలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయని సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రణాళికాశాఖ తీసుకోవాల్సిన పలు కీలక నిర్ణయాలన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కార్యాలయం నుంచే వెలువడుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన నిటి ఆయోగ్ సమావేశంలో ప్రతిపాదించాల్సిన అంశాలను కూడా సీఎస్ కార్యాలయ అధికారులే రూపొందించటం గమనార్హం. ప్రణాళికాశాఖకు చెందిన పలువురు అధికారులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ప్రణాళికశాఖతోగాని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శితోగానీ ఎలాంటి సంప్రదింపులు, చర్చలు లేకుండానే పలు నిర్ణయాలు జరిగిపోతున్నాయని వినికిడి.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే, మన ఊరు-మన ప్రణాళిక తదితర కార్యక్రమాలన్నింటినీ ప్రణాళికాశాఖే రూపొందించింది. తద్వారా నూతన రాష్ట్ర సమగ్ర స్వరూపాన్ని ప్రభుత్వానికి నివేదికల రూపంలో అందించింది. వాటిలోని సామాజిక, ఆర్థిక గణాంకాల ఆధారంగానే ప్రభుత్వం.. గొర్రెలు, బర్రెల పంపిణీ, చేప పిల్లలను చెరువుల్లోకి వదలటం తదితర కార్యక్రమాలను రూపొందించింది. అవి ఏ మేరకు జనానికి ఉపయోగపడ్డాయనే అంశాన్ని పక్కనబెడితే.. వాటిని రూపొందించటంలో మాత్రం ప్రణాళికాశాఖ కీలక పాత్ర పోషించిందనేది వాస్తవం. ఇంతటి కీలకమైన శాఖకు పూర్తిస్థాయిలో ముఖ్య కార్యదర్శి లేకపోవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. ఇదే విషయాన్ని ఒక కీలక అధికారి వద్ద ప్రస్తావించగా.. 'మోడీ ప్రభుత్వం కేంద్రంలోని ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. ఆ ప్రభావంతో ఇక్కడి ప్రణాళికాశాఖ కూడా నామమాత్రమైంది...' అని సమాధానమిచ్చారు.