Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేజీ టు పీజీ విద్యాపథకంలో భాగం చేయాలి : ఎస్ఎఫ్ఐ రౌండ్టేబుల్లో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
- సెల్ఫ్ఫైనాన్స్ కోర్సులుగా మార్చడం పేద విద్యార్థులకు నష్టం
- యాజమాన్యాలతో టీఆర్ఎస్ సర్కారు కుమ్మక్కు
- విద్యార్థి, అధ్యాపక సంఘాల నేతల విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణకు బలమైన ఉద్యమం నిర్మించాలని మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ పిలుపునిచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్యాపథకంలో గురుకులాలనే కాకుండా ఎయిడెడ్ విద్యాసంస్థలనూ భాగం చేయాలని సూచించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసివేయడం తమ విధానమని ఉమ్మడీ ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు స్వస్తి పలకడం టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని అన్నారు.
ఒక్కో ఎయిడెడ్ కాలేజీకి ఒక్కో చరిత్ర ఉందని చెప్పారు. ఎయిడెడ్ విద్యాసంస్థల వల్ల తెలంగాణ సమాజానికి కలిగిన ప్రయోజనాలను బహిరంగపరచాలని సూచించారు. కామర్స్ అంటే బద్రుకా కాలేజీ అని, పైరవీలతో సీటు రాదని, ప్రతిభకే పట్టం కడతారని గుర్తు చేశారు. రెండు, మూడు దశాబ్ధాలుగా పాలకులు ఎయిడెడ్ విద్యాసంస్థలను హత్య చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలను ఏకం చేయాలని, అప్పుడే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి కొట్టగలమని అన్నారు. ఉన్నత విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్ అందెసత్యం మాట్లాడుతూ ఎయిడెడ్ కోర్సులను అన్ఎయిడెడ్గా, సెల్ఫ్ఫైనాన్స్గా మార్చడం జయశంకర్ ఆత్మఘోషిస్తుందని చెప్పారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల అధ్యాపక సంఘం సలహాదారులు నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యాసంస్థలు మార్కెట్ పరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం వర్తింపచేయాలని కోరారు.
బద్రుకా కాలేజీ అధ్యాపకులు డేవిడ్ ప్రేమ్రాజ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ను నేరుగా ఎత్తివేయకుండా, పరోక్షంగా ఎయిడెడ్ కోర్సులను తెలంగాణ ప్రభుత్వం సెల్ఫ్ఫైనాన్స్గా మార్చిందని విమర్శించారు. బద్రుకా కాలేజీలో ఎయిడెడ్ కోర్సులను నడుపుతామని చెప్పినా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు.
దీంతో పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ విజరుకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి పరుశురాం, పీడీఎస్యూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు, టీవీవీ నాయకులు సునీల్, తెలంగాణ అఫిలియేటెడ్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీఆక్టా) ప్రధాన కార్యదర్శి గంట జలంధర్రెడ్డి మాట్లాడుతూ సెల్ఫ్ఫైనాన్స్ కోర్సులుగా మార్చిన నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఎయిడెడ్ విద్యారంగాన్ని కాపాడాలని సూచించారు.
ఆస్తులను ప్రభుత్వమే స్వాదీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. యూజీసీ నిధులు వాడిన ఎయిడెడ్ కాలేజీలపై సీబీసీఐడీ విచారణ జరపాలని కోరారు.
ఎయిడెడ్ కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నుంచి తప్పించుకోవడం, ఆస్తులను ప్రయివేటుపరం చేసేందుకు ఎయిడెడ్ కోర్సులను సెల్ఫ్ఫైనాన్స్గా మార్చిందని మండిపడ్డారు.
ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి జావెద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు అశోక్రెడ్డి, డీవైఎఫ్ఐ నగర అధ్యక్షుడు మహేందర్, ఎయిడెడ్ అధ్యాపకులు పట్టా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.