Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, తగిన పరిహారం ఇవ్వాలి
- గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ముట్టడిలో మల్లన్న ముంపు బాధితులు
నవతెలంగాణ-గజ్వేల్
మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూమి కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, డబుల్ బెడ్ రూం ఇండ్లతో పాటు సర్కార్ హామీలన్నీ అమలు చేయాలని ఎర్రవల్లి భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయాన్ని నిర్వాసితులు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎర్రవల్లి గ్రామస్తులవి కేవలం భూములే పోతవని చెప్పిన అధికారులు, ఇప్పుడు ఇండ్లు కూడా పోతున్నాయని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన పరిహారం చెల్లించి, నివాసం కూడా కల్పిస్తామని మంత్రి, కలెక్టర్, ఆర్డీఓలు హామీనిచ్చి అమలు చేయడం లేదన్నారు. కనీసం ఉపాధి కోసం పనులు కూడా చూపించడం వాపోయారు. నిర్వాసితులకు బీఎల్ఎఫ్ నాయకులు ఎల్లయ్య సంఘీభావం తెలిపి మాట్లాడారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చట్టాలను మార్చుకుంటూ నిర్వాసితులకు అన్యాయం చేస్తూ ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు. మంత్రి, ఎమ్మెల్యేల భూములు ఎక్కడా పోవడం లేదని, ప్రాజెక్టుల్లో పేద రైతుల భూములే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల ఆందోళనకు ఆర్డీఓ విజయేందర్ స్పందిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. 15 రోజుల్లో వీటిని పూర్తి చేస్తామని హామీనిచ్చారు. స్థిరాస్తులకు విలువ కట్టిస్తామని హామీనివ్వడంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.