Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దండేపల్లి
అప్పుల బాధ తాళలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లిలో శనివారం జరిగింది. ఎస్ఐ సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతు కందుకూరి సుదర్శన్(33) గత ఖరీఫ్లో తన మూడెకరాల పొలంలో వరి సాగు చేశాడు. దోమకాటుతో పంట చేతికందలేదు. పెట్టుబడికి తెచ్చిన అప్పులు రబీలోనైనా తీరుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. రబీలోనూ మూడెకరాల్లో వరి సాగు చేయగా ఆశించిన దిగుబడి రాలేదు. బాకీలు వడ్డీతో కలిపి రూ.5లక్షలు కావడంతో అవి ఎలా తీర్చాలని సుదర్శన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం పొలం దగ్గరికి వెళ్లిన సుదర్శన్ సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు పొలానికి పోయి చూడగా సుదర్శన్ పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని లక్షెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. రైతుకు భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సంజీవ్ తెలిపారు.