Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణాలతో బయటపడ్డ వాచ్మెన్ కుటుంబం
- శేరిలింగంపల్లి శ్రీమయూరి రెసిడెన్సీలో ఘటన
నవతెలంగాణ - కేపీహెచ్బీ
ఓనర్ను ఇంటివద్ద దింపాక...అలసిపోయిన డ్రైవర్ కారును అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసి నిద్రపోయాడు. భారీ వర్షం పడటంతో రాత్రి రెండు గంటల ప్రాంతంలో సెల్లార్ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. కారు నీటమునగటంతో డ్రైవర్ ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జయానగర్ కాలనీలో గల శ్రీమయూరి రెసిడెన్సీలో జరిగింది. వాచ్మెన్ కుటుంబ సభ్యులు సెల్లార్లోకి వరద వస్తుండటాన్ని పసిగట్టి మొదటి ప్లోర్కెళ్లి ప్రాణాలను కాపాడుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం...మాజీ ఆర్మీ అధికారి నవీన్ శ్రీమయూరి రెసిడెన్సీలో నివాసముంటున్నాడు. శుక్రవారం ఏపీ 9 బీజే 0324 అనే నెంబరు గల తన కారులో డ్రైవర్ గోపితో కలిసి బయటకెళ్లాడు. అదే రాత్రి 12 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్కు వచ్చారు. డ్రైవర్ను ఇంటికెళ్లమని చెప్పిన నవీన్ నాల్గవ అంతస్తులోని తన ఇంటికి వెళ్లి పోయాడు. బాగా అలసిపోయిన గోపి ఇంటికెళ్లకుండా సెల్లార్లో కారు పార్క్ చేసి అందులోనే నిద్రపోయాడు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి వరదనీరు ఒక్కసారిగా అపార్ట్మెంట్ సెల్లార్లోకి చేరింది. వర్షపు నీరు కారును ముంచెత్తింది. సెల్లార్లో భారీగా వరద నీరు చేరిందని అగ్నిమాపక సిబ్బందికి అపార్ట్మెంట్ వారు సమాచారమిచ్చారు. వారు తెల్లవారుజామున మోటార్లతో నీటిని తోడి పోశారు. ఈ క్రమంలోనే కారులో డ్రైవర్ మృతదేహం లభ్యమైంది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. అయితే అపార్ట్మెంట్ సెల్లారులోని ఓ చిన్న గదిలో ఉంటున్న వాచ్మెన్ శ్రీనివాస్ కుటుంబం ఒక్కసారిగా సెల్లార్లోకి వరదనీరు ప్రవేశించడంతో అయోమయానికి గురైంది. అప్రమత్తమైన శ్రీనివాస్ తన భార్య, ముగ్గురు పిల్లలను తీసుకుని మొదటి అంతస్తుకు వెళ్లాడు. డ్రైవర్ కారులో పడుకున్న విషయాన్ని పసిగట్టలేదు.