Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్షన్ల నమోదులో పలు సాంకేతిక సమస్యలు
- సీనియార్టీ జాబితా, పాయింట్లలో తప్పులు
- మండలాల పేర్లు లేక టీచర్ల అవస్థలు
- ఖాళీ చూపిన పాఠశాలలన్నీ ఎంచుకోవడంపై ఆందోళన
- లోపాలు సరిదిద్దాలని ఉపాధ్యాయుల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల వెబ్కౌన్సెలింగ్పై అయోమయం నెలకొంది. శనివారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఆప్షన్ల నమోదు ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెబ్కౌన్సెలింగ్ సర్వర్ బిజీ కావడం, కొద్దిసేపు మొరాయించడంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురయ్యారు. వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనా ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా, పాయింట్ల లెక్కింపులోనూ తప్పులు వచ్చాయి. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల పేర్లు మాత్రమే వెబ్సైట్లో దర్శనమివ్వడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఒకే పాఠశాల పేరుతో అనేకం ఉన్నాయి. ఏ పాఠశాలను ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ పాఠశాలకు ఏ మండలంలో ఉందో తెలియక ఉపాధ్యాయులు అనేక అవస్థలు పడ్డారు. ఖాళీ ఉన్న పాఠశాలను మండలాల వారీగా పేర్లు ఉంటే ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు ఖాళీ చూపిన పాఠశాలలన్నింటినీ అవసరం లేకున్నా ఎంచుకోవాల్సి వస్తున్నది. ఇది ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. అవసరం లేని పాఠశాలలను ఎంచుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీ, పాయింట్ల ఆధారంగా కోరుకునే పాఠశాలలను అవసరం ఉన్న మేరకు ఎంచుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రధానోపాధ్యాయులకు తక్కువ పాఠశాలలను ఎంచుకునే అవకాశమున్నందున ఎక్కువ ఇబ్బందుల్లేవు. అదే స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లు వేల పాఠశాలలను ఎంచుకోవాల్సి వస్తుంది. వేల పాఠశాలల్లో ఖాళీలుంటాయి. అన్ని పాఠశాలలనూ ఆప్షన్లు ఎంచుకోవాలన్న నిబంధన ఉంటే స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎంచుకున్న ఆప్షన్లను మార్పుచేర్పులకు అవకాశం కల్పించాలి. అది లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు ఒకే పోస్టు వివిధ పాఠశాలల్లో కనిపిస్తున్నది. ఒకే పాఠశాల ఆప్షన్ ఇచ్చినా మరోసారి దర్శనమిస్తున్నది. ఏజెన్సీ నుంచి మైదానం ప్రాంతానికి ఉపాధ్యాయులు బదిలీ కావాలంటే ఖాళీల మేరకే అవకాశం కల్పిస్తామని అధికారులు అంటున్నారు. ఇలా వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియలో అనేక లోపాలు వస్తున్నాయి. ఈ లోపాలను సరిదిద్ది వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఇబ్బందుల్లేకుండా జరపాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.