Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పండుగలు, సంస్కృతి, ఉత్తమ వార్త చిత్రాల రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్పీజేఏ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీజేఏ అధ్యక్షుడు అనుమల్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె నరహరి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2017 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు తీసిన చిత్రాలను వచ్చేనెల 10వ తేదీ నాటికి బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో ఉన్న టీఎస్పీజేఏ కార్యాలయానికి పంపించాలని కోరారు. ఈ ఫొటోగ్రఫీ పోటీలను రెండు విభాగాలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పండుగలు, సంస్కృతి మొదటిది, ఉత్తమ వార్త ఛాయాచిత్రాలు రెండో విభాగమని పేర్కొన్నారు. ఈ పోటీలకు వేర్వేరుగా విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు. మొదటి విజేతకు నగదు బహుమతి రూ.10 వేలు, రెండో విజేతకు రూ.8 వేలు, మూడో విజేతకు రూ.5 వేలు, పది మందికి ప్రోత్సాహక బహుమతుల కింద రూ.2 వేల చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల 18న న్యాయనిర్ణేతలు పరిశీలించి అదేరోజు ప్రకటిస్తారని తెలిపారు. వచ్చేనెల 19 నుంచి బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఛాయాచిత్ర ప్రదర్శన, 26న బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని పేర్కొన్నారు.